‘శిల్ప మృతికి లైంగిక వేధింపులే కారణం’

9 Nov, 2018 20:23 IST|Sakshi
డాక్టర్‌ శిల్ప(పాత చిత్రం)

తిరుపతి: ప్రొఫెసర్ల లైంగిక వేధింపుల వల్లే డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు పాల్పడిందని సీఐడీ తేల్చింది.  ఈ మేరకు సీఐడీ డీఎస్పీ అమ్మిరెడ్డి  నివేదిక వివరాలను మీడియాకు వివరించారు. ఈ ఏడాది ఆగష్టు 7వ తేదీన తన ఇంట్లో శిల్ప ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది.ఈ ఆత్మహత్య ఘటనపై డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీనిలో భాగంగా సీఐడి విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. డాక్టర్ శిల్పను  ముగ్గురు ప్రొఫెసర్లు రవికుమార్, శశికుమార్, కిరీటీ లైంగికంగా వేధింపులకు గురిచేశారని సీఐడీ నివేదిక తేల్చింది.

ఈ ఘటనకు సంబంధించి 47 మందిని విచారించినట్లు అమ్మిరెడ్డి  పేర్కొన్నారు. అదే సమయంలో డిజిటల్‌ ఆధారాలు , సిట్‌ దర్యాప్తు బృందం, వివిధ కమిటీల రిపోర్టులను సేకరించినట్లు అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. శిల్ప మైగ్రేన్‌తో తీవ్రంగా బాధపడుతూ ఉండేదని, ఈ క్రమంలోనే వైద్యుల లైంగిక వేధింపులు తోడవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. శిల్ప మరణానికి భర్త, బంధువులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇప్పటికే బెయిల్‌ కోసం నిందితులు హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారని, ఆత్మహత్యపై త్వరలోనే ఛార్జిషీటును దాఖలు చేస్తామని డీఎస్పీ తెలిపారు.

ఇక్కడ చదవండి: ‘అలా చేసుంటే శిల్ప బతికేది’

నిర్లక్ష్యమే ఉసురు తీసిందా!?

మరిన్ని వార్తలు