ఒకదానికొకటి మూడు లారీల ఢీ

29 Jan, 2018 10:40 IST|Sakshi
క్లీనర్‌ రమేష్‌ మృతదేహం

ఓ లారీ క్లీనర్‌ దుర్మరణం

ఇద్దరు డ్రైవర్లకు గాయాలు

మృతుడిది విశాఖపట్నం

గుడ్లూరు: మూడు లారీలు ఒక దానికొకటి ఢీకొనడంతో ఓ లారీ క్లీనర్‌ మృతి చెందగా ఇద్దరు డ్రైవర్లుకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని జాతీయ రహదారిపై చేవూరు జంక్షన్‌ వద్ద శనివారం అర్ధరాత్రి జరిగింది. అందిన వివరాల ప్రకారం.. చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న లారీని చేవూరు వద్దకు వచ్చే సరికి వెనుకనే వస్తున్న మరో లారీ ఓవర్‌ టేక్‌ చేయబోయి అదుపుతప్పి ఢీకొట్టింది. అదే సమయంలో వెనుకనే వస్తున్న మరో లారీ మధ్యలో లారీని వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మధ్య లారీ డోరు ఊడి పోవడంతో క్లీనర్‌ రమేష్‌ (35) ఎగిరి రోడ్డుపై పడి తల పగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడి. డ్రైవర్‌ శ్రీనివాసులు, వెనుక లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ట్రాఫిక్‌ నిలిచి పోయింది.

సమాచారం అందుకున్న హైవే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను తమ వాహనంలో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. క్లీనర్‌ రమేష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతుడి రమేష్‌ది విశాఖపట్నంలోని చిలకపేట గ్రామం. సంఘటన స్థలాన్ని ఇన్‌చార్జి ఎస్‌ఐ రమణయ్య, గుడ్లూరు పోలీసుస్టేషన్‌ రైటర్‌ డానియేలు పరిశీలించి వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు