30 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వర్సిటీ వీసీ

4 Feb, 2018 03:19 IST|Sakshi
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీసీ గణపతి

సాక్షి, చెన్నై: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకానికి రూ.30 లక్షలు లంచం తీసుకుంటూ కోయంబత్తూరులోని భారతీయార్‌ వర్సిటీ వీసీ గణపతి అవినీతి నిరోధక విభాగం అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టు కోసం సురేశ్‌ అనే అభ్యర్థి వీసీ గణపతిని సంప్రదించాడు. అయితే, ఆయన రూ.35లక్షలు డిమాండ్‌ చేయగా చివరకు రూ.30 లక్షలకు ఒప్పందం కుదిరింది. దీనిపై సురేశ్‌ అవినీతి నిరోధక విభాగానికి సమాచారం అందించాడు.

ఈ మేరకు శుక్రవారం రూ.లక్ష నగదు, రూ.29 లక్షలకు చెక్కులను వీసీకి ఆయన నివాసంలో అందజేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించారన్న ఆరోపణలపై వర్సిటీ ప్రొఫెసర్‌ ధర్మరాజ్‌పైనా కేసు నమోదు చేశారు. ఇద్దరి నివాసాల్లోనూ సోదాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న కరెన్సీ నోట్లను చించివేసి డ్రైనేజీలో పడ వేసిన వీసీ భార్య స్వర్ణలతపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు