చెన్నైలో మృగోన్మాదం

10 Mar, 2018 02:27 IST|Sakshi

యువతిని వెంటాడి గొంతుకోసిన కిరాతకుడు  

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రేమించడం లేదన్న కోపంతో ఓ యువతిని ప్రేమోన్మాది కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఇక్కడి మధురవాయల్‌కు చెందిన అశ్వని(18) స్థానికంగా ఓ కాలేజీలో బీకాం మొదటి సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన అళగేశన్‌(22) అనే యువకుడితో ఆమెకు స్నేహం ఏర్పడింది. కొన్నాళ్లకు తనను తనను ప్రేమించాలని వేధించడం మొదలుపెట్టాడు. ఆమె అంగీకరించకపోవడంతో కోపంతో ఇంట్లోకి చొరబడి తాళి కట్టాడు. యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అళగేశన్‌ జైలు పాలయ్యాడు.

ఇటీవల  బెయిల్‌పై బయటికొచ్చి మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో ఉంచి 10 రోజులు కాలేజీకి పంపలేదు. 8 నుంచి అశ్వనీ కళాశాలకు వస్తోందని తెల్సుకుని శుక్రవారం మధ్యాహ్నం కాలేజీ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశాడు. వదిలేయమని బతిమాలుతున్నా వినకుండా కత్తితో నిర్దాక్షిణ్యంగా ఆమె గొంతు కోశాడు. దీంతో అశ్వని గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయింది. పరారయ్యేందుకు యత్నించిన అళగేశన్‌ను స్థానికులు పట్టుకుని చితకబాదడంతో అతను స్పృహ కోల్పోయాడు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చెన్నై కేకే నగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు