అమ్మాయి కోసం ఘర్షణ

22 Aug, 2018 12:21 IST|Sakshi
గాయపడిన యువకుడు

ఒక యువకుడి తలకు తీవ్రగాయాలు

అనంతపురం సెంట్రల్‌: అమ్మాయి కోసం విద్యార్థులు ఘర్షణపడ్డారు. ఏకంగా రాళ్లు, కట్టెలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడి తలకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు సకాలంలో స్పందించడంతో గొడవ సద్దుమణిగింది. వివరాల్లోకెళితే.. అనంతపురంలోని ఆర్ట్స్‌ కళాశాల వసతి గృహంలో మంగళవారం ఇద్దరు విద్యార్థులు అమ్మాయి విషయంలో గొడవపడ్డారు. తొలుత జూనియర్‌ విద్యార్థిపై సీనియర్లు చేయి చేసుకున్నారు. దీంతో సదరు విద్యార్థి బంధువులను వెంటతీసుకుని సాయంత్రం ఆర్ట్స్‌ కళాశాల వసతిగృహం వద్దకు వచ్చాడు.

సీనియర్లతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో ఒకరికొకరు కొట్టుకున్నారు. జూనియర్‌ విద్యార్థికి మద్దతుగా వచ్చిన బాలు అనే యువకుని తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో వసతిగృహం విద్యార్థులు భయాందోళన చెందారు. బయట వ్యక్తులు వసతిగృహంలోకి వచ్చి కొడుతున్నారంటూ పోలీసులకు సమాచారం అందించారు. త్రీటౌన్‌ ఎస్‌ఐ క్రాంతికుమార్‌ సిబ్బందితో వచ్చి జరిగిన విషయంపై ఆరా తీశారు. గాయపడిన బాలును ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గొడవ పడ్డ విద్యార్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహించి వదిలేశారు. త్రీటౌన్‌ సీఐ మురళీకృష్ణను వివరణ కోరగా.. విద్యార్థుల మధ్య చిన్న గొడవ జరిగిందని, అప్పుడే అది సద్దుమణిగిందన్నారు.

మరిన్ని వార్తలు