నటి శ్రీరెడ్డిపై ఫిర్యాదు

24 Jul, 2018 09:31 IST|Sakshi
శ్రీరెడ్డి

పెరంబూరు (తమిళనాడు): నటి శ్రీరెడ్డి ఇంతకు ముందు టాలీ వుడ్‌లో ప్రకంపనలు పుట్టించింది. ఈమె తాజాగా కోలీవుడ్‌ను టార్గెట్‌ చేసింది. కాస్టింగ్‌ కౌచ్‌ అంటూ ప్రముఖ దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్, సుందర్‌.సీ నుంచి నటుడు రాఘవ లారెన్స్, శ్రీకాంత్‌ (తెలుగులో శ్రీరామ్‌) వరకూ ఆరోపణలు చేసి సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే నడిగర్‌ సంఘం కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించినా శ్రీరెడ్డి వాటిని కేర్‌ చేయకుండా చెన్నైలో మకాం పెట్టి కలకలం సృష్టిస్తోంది. దీంతో నటుడు వారాహి సోమవారం చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఇందులో నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌లోని ప్రముఖులపై కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు, బెదిరింపులతో డబ్బు వసూలుచేసిందన్నారు. ఇప్పుడు కోలీవుడ్‌లో బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొన్నారు. శ్రీరెడ్డి ఇటీవల ఒక భేటీలోఅత్యాచార వేధింపులకు ఆధారాలున్నాయా? అన్న ప్రశ్నకు మహిళలను కించపరచేలా బదులిచ్చిందన్నారు. ఆమె వ్యభిచారాన్ని అంగీకరించినట్లు పేర్కొందన్నారు. శ్రీరెడ్డిని వ్యభిచార కేసులో అరెస్ట్‌ చేయాలని ఫిర్యాదులో కోరారు.

శ్రీరెడ్డిపై ఆగ్రహం..
శ్రీరెడ్డి చర్యలపై కోలీవుడ్‌లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోంది. సీనియర్‌ నటీమణుల నుంచి వర్థమాన నటీమణుల వరకూ శ్రీరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్‌ నటి ఈ వ్యవహారంపై స్పందిస్తూ నటీమణుల అత్యాచారాలను బహిరంగపరడం తగదన్నారు. మంచి చెడు అన్నవి అన్ని రంగాల్లోనూ ఉంటాయన్నారు. అలాంటిది సినిమా రంగం గురించే మాట్లాడడం ప్రచారం కోసమేనన్నారు. నటి త్రిష మాట్లాడుతూ ఇలాంటి విషయాలకు బదులివ్వాల్సిన అవసరం లేదన్నారు. అసలు శ్రీరెడ్డి ఎవరో తనకు తెలియదన్నారు. ఆమెను ఇలాంటి ప్రచారంతో మరింత పెద్దదాన్ని చేయకండి అని పేర్కొన్నారు. యువ నటీమణులు ఐశ్వర్యమీనన్, అర్తన వంటి వారు కూడా తప్పుడు ఆలోచనలతో పిలిచేవారికి దూరంగా ఉండడం నేర్చుకోవాలన్నారు. రైట్‌ పర్సన్‌తోనే కలిసి పని చేయాలన్నారు. ఇలా కాస్టింగ్‌ కౌచ్‌ పేరుతో రచ్చ చేయడం తగదని శ్రీరెడ్డిపై ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు