మోసపోయాం..న్యాయం చేయండి..!

14 Nov, 2017 11:27 IST|Sakshi

అర్బన్‌ ఎస్పీ గ్రీవెన్స్‌లో బాధితుల వేడుకోలు

గుంటూరు : నమ్మి మోసపోయాం...మోసగాళ్లపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్బన్‌ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన బాధితులు ఎస్పీ విజయారావును వేడుకున్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని అర్బన్‌ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ జరిగింది. ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయం జరిగేలా చూస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. బాధితుల సమస్యలు కొన్ని వారి మాటల్లోనే.....

బోర్డు తిప్పేసిన కోచింగ్‌ సెంటర్‌
బ్రాడీపేట 4వలైనులో 9నెలల క్రితం ఓ కోచింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. నిర్వాహకుడు ఉదయభానుకు కోచింగ్‌ నిమిత్తం రూ.20 వేలు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాం. నా మాదిరిగానే మరో 19 మంది విద్యార్థులు డబ్బు చెల్లించారు. రాత్రికి రాత్రి బోర్డు తిప్పి పరారయ్యాడు. ఫోన్‌ చేస్తే సమాధానం లేదు. విచారించి న్యాయం చేయాలి.
– తల్లిదండ్రులతో విష్ణుప్రియ, అరండల్‌పేట, గుంటూరు

సంతకాలు ఫోర్జరీ చేసి కారు అమ్మేశాడు
నరసరావుపేటకు చెందిన కాళంగి నాగేశ్వరరావుకు మారుతీ కారును కంటిన్యూ ఫైనాన్స్‌ పద్ధతిపై ఫైనాన్స్‌ చెల్లించేలా మాట్లాడుకొని కారును తొమ్మిది నెలల క్రితం విక్రయించాం. ఫైనాన్స్‌ చెల్లించపోగా, ఫోర్జరీ సంతకాలతో మా ప్రమేయం లేకుండానే కారును అమ్మినట్టు తెలిసింది. గట్టిగా నిలదీస్తే మీకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నాడు. ఫైనాన్స్‌ వారు డబ్బు చెల్లించాలంటూ మాపై వత్తిడి చేస్తున్నారు. విచారించి నారాయణపై చర్యలు తీసుకోండి. – మేడిపల్లి వెంకటేష్, సునీత దంపతులు, చుట్టుగుంట, గుంటూరు

మరిన్ని వార్తలు