రూపాయి కోసం చిందిన రక్తం

3 Dec, 2019 10:43 IST|Sakshi
ప్రయాణికుడికి రక్తగాయాలైన దృశ్యం

ప్రయాణికుడు– ఆర్టీసీ కండక్టర్‌ ముష్టియుద్ధం  

ప్రయాణికునికి తీవ్ర గాయాలు  

కర్ణాటక ,తుమకూరు: ఒక్క రూపాయి కోసం రక్తం చిందింది. ఎవరో ఒకరు సర్దుకునిపోయి ఉంటే సరిపోయేదానికి బాహాబాహీ తలపడడంతో అందరూ విస్తుపోయారు. రూపాయి చిల్లర విషయమై కండక్టర్‌–ప్రయాణికుని మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన మధుగిరి తాలూకా చిక్కపాలనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం మధుగిరి నుంచి బెంగళూరుకు బయలుదేరిన కేఎస్‌ఆర్టీసీ బస్సులో నాగేనహళ్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాదనాయకనహళ్లికి వెళ్లడానికి టికెట్‌ తీసుకున్నాడు. తన స్టాప్‌ సమీపిస్తుండడంతో తనకు ఇవ్వాల్సిన ఒక్క రూపాయి చిల్లర ఇవ్వాలంటూ ప్రయాణికుడు కంబయ్య కండక్టర్‌ అజ్జప్పను అడిగాడు. అయితే తన వద్ద చిల్లర లేదని కండక్టర్‌ బదులివ్వడంతో ఇదే విషయమై ప్రయానికుడు, కండక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు.

ప్రయాణికుడికి రక్తగాయాలైన దృశ్యం 
టికెట్‌ మిషన్‌తో కండక్టర్‌ వీరంగం :  ఇది శృతి మించడంతో కంబయ్య, అజ్జప్ప ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో కండక్టర్‌ అజ్జప్ప టికెట్‌ మిషన్‌తో కంబయ్యపై దాడి చేయడంతో కంబయ్యకు గాయాలయ్యాయి. గమనించిన ప్రయాణికులు ఇరువురిని విడిపించి కండక్టర్‌ అజ్జప్పపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మధుగిరి పోలీసులు కంబయ్యను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రూపాయి ఇవ్వకుండా రక్తం వచ్చేలా కొట్టిన కండక్టర్‌ దురుసుతనంపై ప్రయాణికులు మండిపడ్డారు. ఈ గొడవ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

మరిన్ని వార్తలు