పిలిస్తే రాలేదని..

18 Jun, 2019 08:22 IST|Sakshi

యువకులపై బస్తీ నేతల దాడి

బంజారాహిల్స్‌: బస్తీలో తమను కాదని హల్‌చల్‌ చేస్తున్నావంటూ పెళ్లి బరాత్‌లో ఓ యువకుడిపై స్థానిక నాయకులు దాడికి పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–2, ఇందిరానగర్‌కు చెందిన వినోద్‌కుమార్‌ ప్రైవేట్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి అతను తన బావ పెళ్లి బారాత్‌లో పాల్గొన్నాడు. అదే సమయంలో బస్తీకి చెందిన నాయకుడు లడ్డురాజు యాదవ్‌ వినోద్‌ను తన వద్దకు రమ్మని పిలిచాడు. అతను రాకపోవడంతో పది నిమిషాల తర్వాత అక్కడికి వెళ్లిన రాజుయాదవ్‌ తమాషా చేస్తున్నావా..? నేను పిలిస్తే రావా...? ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నావ్‌.. అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు.

అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఉద్రిక్తతకు నెలకొంది. అదే రోజు రాత్రి సంతోష్‌ అనే యువకుడి ఇంటికి వెళ్లిన రాజు యాదవ్, రాజేష్, వడ్డెర శ్రీనివాస్‌ అతడి తల్లి పుష్పలతను  దూషించారు. ఈ విషయం తెలియడంతో అక్కడికి వెళ్లిన వినోద్‌ను మరోసారి బెదిరించారు. తెల్లవారుజామున వినోద్, తన స్నేహితులు శివ, ఆంథోనితో కలిసి స్థానిక గణేశ్‌మండపం వద్ద టిఫిన్‌ చేస్తుండగా అక్కడికి వెళ్లిన లడ్డురాజుయాదవ్, అతడి కుమారులు అభిమన్యు, సంతోష్, అనుచరులు రాజేష్, వడ్డెర శ్రీను, శ్రీనివాస్, వికాస్, రాకేష్‌ కర్రలతో శివ, ఆంథోనిలపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. వినోద్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు