రైలు కిందపడి కానిస్టేబుల్‌ ఆత్మహత్య

7 Feb, 2018 03:00 IST|Sakshi

హైదరాబాద్‌: ఫేస్‌బుక్‌ ద్వారా ఓ వివాహిత పరిచయం కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు దారితీసింది. ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోపాటు, రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని ఆమె భర్త ఫిర్యాదు మేరకు శంషాబాద్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. ఉన్నతాధికారులు బదిలీ వేటు వేయడంతో మస్తాపానికి గురైన కానిస్టేబుల్‌ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను ఎస్‌ఐ  మీడియా కు వెల్లడించారు. మౌలాలి రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కిందపడి యువకుడు మృతి చెందినట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. మృతదేహం వద్ద లభించిన గుర్తింపు కార్డులు, సెల్‌ఫోన్‌ ఆధారంగా లాలాపేటకు చెందిన పి.సందీప్‌కుమార్‌ (24)గా గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.  

మనస్తాపానికి గురై...: సందీప్‌ మొఘల్‌పుర పీఎస్‌లో కానిస్టేబుల్‌. కొంత కాలం క్రితం ఒక వివాహితతో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీయడంతోపాటు తన భార్యను సందీప్‌ రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ఆమె భర్త నాగార్జున శంషాబాద్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఉన్నతాధికారులు సందీప్‌ను హెడ్‌క్వార్టర్‌కు అటాచ్‌ చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సందీప్‌ తండ్రి ఆటోడ్రైవర్‌. చేతికందిన ఒక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

మరిన్ని వార్తలు