వేధింపులు భరించలేక కానిస్టేబుల్ భార్య ఆత్మహత్యాయత్నం
అజిత్సింగ్నగర్ (విజయవాడ సెంట్రల్): భర్త వేధింపులకు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. విజయవాడ సింగ్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగ్నగర్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మురళీకృష్ణకు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన హోంగార్డు లక్ష్మీప్రసన్న (26)తో 2015లో వివాహమైంది. వారికి బాలుడు ఉన్నాడు.
కొంతకాలం నుంచి మురళీకృష్ణ ప్రవర్తనలో మార్పు వచ్చింది. నిత్యం ఇంటికి వచ్చి ఆమెను తిట్టడం, కొట్టడం, వేధించడం చేస్తున్నాడు. గతనెల 30న తన పిల్లాడి విషయమై భార్య భర్తలిద్దరికి మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంటిలోకి వెళ్లి ఒంటిపై టిన్నర్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ముమ్మాటికీ హత్యాయత్నమే
నమ్మించి నా బిడ్డను వివాహమాడిన కానిస్టేబుల్ మురళీకృష్ణే తమ కుమార్తెను హత్య చేయబోయాడని బాధితురాలు లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న లక్ష్మీప్రసన్న
ఒళ్లంతా నిప్పంటుకోవడం శరీరంలో 90 శాతం వరకు కాలిపోయిందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఆమెను తరలించి చికిత్స చేయిస్తున్నారు.