సాక్షి, హైదరాబాద్: ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి 246 గ్రాముల బంగారాన్ని, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. నిందితులను సయ్యద్ మజీద్, మహమ్మద్ మొహసీన్లుగా గుర్తించామన్నారు. వీరు పాత నేరస్థులేనని వెల్లడించారు. గతంలో 40 దొంగతనాలు చేయగా పలు మార్లు అరెస్ట్ అయ్యారని, ఒకసారి పీడీ యాక్ట్పై జైలుకు కూడా వెళ్లారని తెలిపారు.
జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ వీరు వక్రబుద్ధి పోనిచ్చుకోలేదు. తరువాత కూడా మళ్లీ నేరాల బాట పట్టారు. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తారు. పగలు ప్లాన్ చేసుకుంటారు. రాత్రి దొంగతనానికి దిగుతారు. ఈ క్రమంలోనే టపాచ పుత్రలోని ఓ ఇంట్లో ఆభరణాలను, నగదును దోచుకున్నారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.