నల్లగొండ జిల్లా : పట్టణంలోని లెప్రసీ కాలనీలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో శుక్రవారం వేకువజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో ఒక డీఎస్పీ, తొమ్మిది మంది సీఐలు, 14 మంది ఎస్ఐలు, 16 మంది మహిళా సిబ్బంది, 171 పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఎలాంటి పేపర్లు లేని 6 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలు, 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు.
అలాగే ఇద్దరు అనుమానిత వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసులు ఫోన్ చేసి తెలుపాలని సూచించారు. ఎలాంటి పరిచయం లేని వారికి ఇల్లు కిరాయి ఇవ్వవద్దని తెలిపారు. అలాగే ఎలాంటి డాక్యుమెంట్ లేని వెహికిల్ నడిపేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.