అర్ధరాత్రి ఘోరం

20 Jan, 2020 08:05 IST|Sakshi

దంపతులు, కొడుకు దారుణ హత్య  

బెళగావి జిల్లాలో విషాదం  

సాక్షి, కర్ణాటక,బళ్లారి: నిద్రిస్తున్న ఒకే కుటుంబంలో ముగ్గురిని దారుణంగా హత్య చేసిన ఘోర సంఘటన బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. శనివారం అర్ధరాత్రి బెళగావి జిల్లా బైలహొంగల తాలూకా దొడ్డవాడ గ్రామంలో ఈ దురాగతం జరిగింది. బైలహొంగల మాజీ టీపీ సభ్యుడు శివానంద అందానశెట్టి, ఆయన భార్య శాంతమ్మ,కుమారుడు వినోద్‌ ఇంట్లో నిద్రిస్తుండగా, గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు.  కత్తులు, కొడవళ్లతో నరికి చంపారు. ఈ నెల 30వ తేదీన కుమారుడు వినోద్‌ పెళ్లి జరగాలి. పెళ్లి పనుల్లో ఉండగా తల్లిదండ్రులతో పాటు అతన్నీ దారుణంగా హత్య చేయడంతో  గ్రామంలోతీవ్ర భయాందోళన అలముకొంది. 

పాత కక్షలే కారణమా  
ఆదివారం ఉదయం ముగ్గురు విగతజీవులుగా పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొడ్డవాడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాతకక్షలు కారణంగా హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని పోలీసు ఉన్నతాధికారులు విలేకరులకు తెలిపారు. పెళ్లితో కళకళలాడాల్సిన ఇంట  ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడంతో బంధువులు ,›గ్రామస్తులు రోదనలు మిన్నంటాయి. రాజకీయ ప్రత్యర్థులు, ఆర్థిక, భూ తగాదాలే కారణమై ఉంటాయని అనుమానిస్తున్నారు.  

మరిన్ని వార్తలు