చికిత్స పొందుతూ భార్య మృతి
వైఎస్ఆర్ జిల్లా, రాజుపాళెం : పాప లేదన్న నిజం వారిని మానసిక క్షోభకు గురిచేసింది. దానికి తోడు ఆర్థిక పరిస్థితులు వేధించాయి. బాధను భరించలేక ఇద్దరూ విషగుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాగా భార్య చికిత్స పొందుతూ మృతిచెందింది.
మండల పరిధిలోని పగిడేల గ్రామానికి చెందిన వలపు హరీశ్కుమార్రెడ్డి, ఆయన భార్య వలపు శ్రీలత (27) విషగుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇద్దరిని ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా శ్రీలత చికిత్స పొందుతూ మృతి చెందింది. మెరుగైన చికిత్స కోసం హరీశ్కుమార్రెడ్డిని కర్నూలుకు తరలించారు. రాజుపాళెం ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన మేరకు... తెలంగాణ రాష్ట్రం వరంగల్కు చెందిన శ్రీలతతో పగిడేల గ్రామానికి చెందిన హరీశ్కుమార్రెడ్డి ఆరేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. ఇంట్లో ఎవరికి తెలియకుండా వెల్లాలలో పెళ్లి చేసుకున్నారు.
వీరి రెండేళ్ల కుమార్తె స్వాతిక అక్టోబర్ 15న జ్వరంతో చనిపోయింది. భార్యాభర్తలు ఇద్దరూ మానసిక క్షోభకు గురయ్యారు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున ఇద్దరూ విషగుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబీకులు, చుట్టుపక్కల వారు వెంటనే వారిని ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రీలత చెందింది. మెరుగైన వైద్యం కోసం హరీశ్కుమార్రెడ్డిని కర్నూలుకు తరలించారు. మృతురాలి తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.