నాలుగేళ్లక్రితం ప్రేమ వివాహం అంతలోనే..

30 May, 2020 07:29 IST|Sakshi
అనాథలైన పిల్లలు , విజయ్‌కుమార్‌రెడ్డి, రుచిత (ఫైల్‌)

యువ దంపతుల ఆత్మహత్య

అత్తింటి వేధింపులే కారణ..?

అనాథలైన ఇద్దరు చిన్నారులు

ప్రగతి ధర్మారంలో ఘటన

రామాయంపేట(మెదక్‌): వారిద్దరూ పెద్దలను ఎదిరించి నాలుగేళ్లక్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు సంతానం.  పెళ్లయి నాలుగేళ్లు గడిచినా ఆమెకు అత్తింటివారి వేధింపులు తప్పలేదు. పెద్దల సూటిపోటిమాటలే ఇద్దరి ప్రాణాలను బలిగొన్నారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ప్రగతి (దొంగల) ధర్మారం గ్రామానికి చెందిన ముస్కుల విజయ్‌ కుమార్‌రెడ్డి (27) వీఆర్‌ఏగా పనిచేస్తున్నాడు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన బోరెడ్డి రాజిరెడ్డి, వెంకటలక్ష్మి పెద్ద కూతురు రుచిత (25)ను ప్రేమ వివాహాం చేసుకున్నాడు. ఈపెళ్లి విజయకుమార్‌రెడ్డి తల్లిదండ్రులకు ఎంతమాత్రం ఇష్టంలేకపోయినా వారికి నచ్చచెప్పి చేసుకొని ఒకే ఇంట్లో ఉంటున్నారు.  వారికి  రెండేళ్లలోపు బాబుతోపాటు పాప సంతానం కలిగారు. కాగా అత్తింటివారు తరచూ రుచితను వేధింపులకు గురి చేస్తుండేవారు. దీనితో ఆమె తల్లిదండ్రులు పలుమార్లు గ్రామంలో పంచాయతీ నిర్వహించినా ఫలితం లేకపోయింది. (లాక్‌డౌన్ ల‌వ్‌: యాచ‌కురాలితో ప్రేమ, ఆపై)

బుధవారం రాత్రి విజయ్‌కుమార్‌రెడ్డి తండ్రి, తల్లితో పాటు, ఇంట్లోనే ఉన్న ఆడపడుచు రుచితను దూషించారు. దీంతో ఆవేదనకు లోనైన విజయ్‌కుమార్‌రెడ్డి, రుచిత పురుగుల మందు తాగారు. అనంతరం  రుచిత ఈవిషయమై తన తండ్రికి ఫోన్‌ చేసి సమాచారం అందించింది. తాము మందు తాగామని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది. వెంటనే అదే రాత్రి రాజిరెడ్డి మరోవ్యక్తితో కలిసి బైక్‌పై ధర్మారం వచ్చి కూతురు, అల్లున్ని రామాయంపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమించగా, సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో గురువారం రాత్రి పది గంటల ప్రాంతంలో రుచిత, శుక్రవారం తెల్లవారుజామున విజయకుమార్‌రెడ్డి మృతిచెందారు. కాగా  చిన్నారులను చూసి గ్రామంలో కంటతడి పెట్టనివారు లేరు.  రుచిత తండ్రి ఫిర్యాదు మేరకు విజయ్‌కుమార్‌రెడ్డి, తల్లితండ్రులతోపాటు ఆడపడుచుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు