లారీ దూసుకెళ్లి దంపతులు దుర్మరణం

13 Dec, 2019 11:34 IST|Sakshi

సాక్షి, చెన్నై‌: బైకు అదుపుతప్పి రోడ్డుపై పడిన దంపతులపై లారీ దూసుకెళ్లడంతో వారు దుర్మరణం చెందారు. అదృష్టవశాత్తు వారి చిన్నారి(18 నెలలు) ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన బుధవారం వీరపాండి సమీపంలో చోటుచేసుకుంది. తేని జిల్లా కొడాంగిపట్టి సమీపంలో ఉన్న మారియమ్మన్‌ కోవిల్‌పట్టికి చెందిన వేల్‌మురుగన్‌ (33).. అక్కడే పూలదుకాణం నడుపుతున్నాడు. ఇతని భార్య వీరలక్ష్మి. వీరికి ఏడాదిన్నర వయస్సు గల ఈశ్వర పాండియన్‌ అనే కుమారుడు వున్నాడు. ఈ క్రమంలో బుధవారం చిన్నమనూరులో జరిగిన పెళ్లి రిసెప్షన్‌లో పాల్గొనడానికి వేల్‌మురుగన్‌ ఇంటి నుంచి భార్య, కుమారుడితో బైకుపై బయల్దేరాడు. వీరపాండి సమీపంలో వున్న ఉప్పారపట్టి ప్రాంతంలో వెళుతుండగా బైకు అదుపుతప్పి దంపతులు బిడ్డతో సహా రోడ్డుపై పడ్డారు.

ఇక అదే సమయంలో ఎదురుగా వచ్చిన లారీ కిందపడి వేల్‌మురుగన్, వీరలక్ష్మి ఇద్దరు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ఈశ్వర పాండియన్‌ మాత్రం ప్రమాదం నుంచి చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన గురించి వీరపాండి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ప్రమాదంలో తల్లిదండ్రులు మృత్యువాత పడటంతో చిన్నారి అనాథ అయ్యాడంటూ పలువురు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు