సహజీవనం: జంట బలవన్మరణం

11 Mar, 2019 20:54 IST|Sakshi

సంగారెడ్డి జిల్లాలో ఘటన

సాక్షి, సంగారెడ్డి రూరల్‌: సహజీవనం చేస్తున్న ఓ జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రూరల్‌ మండల పరిధిలోని హనుమాన్‌నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. రూరల్‌ ఎస్సై శ్రీకాంత్‌ కథనం ప్రకారం కర్ణాటకలోని బీదర్‌కు చెందిన బత్తిని దత్తు (30) హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. హనుమాన్‌ నగర్‌కు చెందిన బత్తిని భారతి(34)కి నాలుగేళ్ల క్రితం దత్తుతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరు కలిసి ఉంటున్నారు. భారతికి ఇద్దరు పిల్లలు ఉండగా 14 ఏళ్ల క్రితం భర్తను వదిలేసింది. దత్తుకు వివాహం కాలేదు. ఈ క్రమంలో కొంతకాలంగా హనుమాన్‌నగర్‌లో రూం కిరాయికి తీసుకుని ఉంటూ సహజీవనం చేస్తున్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి ఈ నెల 8న దత్తు హనుమాన్‌ నగర్‌కు వచ్చాడు. అతడి తండ్రి బాలయ్య కుమారుడిని వెతుక్కుంటూ హనుమాన్‌నగర్‌కు చేరుకున్నాడు. కొడుకు కోసం వెతుకుతూ ఒక ఇంటి ముందు దత్తుకు చెందిన ద్విచక్ర వాహనాన్ని చూసి ఆరా తీశాడు. వారుంటున్న గది దగ్గరకు వెళ్లి దత్తును పిలిచినా సమాధానం రాకపోవడం, తలుపులు మూసి ఉండటంతో అనుమానం వచ్చిన బాలయ్య గ్రామస్తుల సహకారంతో తలుపులను బద్దలు కొట్టాడు. గదిలోకి చూడగా దత్తు, భారతి ఇద్దరూ ఉరి వేసుకుని మృతి చెంది కనిపించారు. బాలయ్య ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు