దంపతుల దారుణ హత్య

2 Sep, 2019 13:26 IST|Sakshi
హత్యకు గురైన భార్యభర్తలు (ఫైల్‌ ఫొటో)

వివాహేతర సంబంధం పర్యవసానం

బెంగళూరు,యశవంతపుర : వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని చిదిమేసింది. ప్రియురాలు తనకు దూరమైందనే అక్కసుతో ఓ వ్యక్తి మహిళతో పాటు ఆమె భర్తను కూడా దారుణంగా హత్య చేసిన ఘటన శనివారం చిక్కమగళూరు జిల్లాలో జరిగింది. నరసింపుర తాలూకా సాత్కోళి గ్రామానికి చెందిన ధర్మయ్య (53), ఆయన భార్య భారతి (43)లను అదే గ్రామానికి చెందిన గోవింద హత్య చేశాడు. వివరాలు... ధర్మయ్య, ఆయన భార్య భారతి కూలి పనులు చేసి జీవనం సాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా భారతికి గోవింద్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం ధర్మయ్యకు తెలియడంతో భారతిని హెచ్చరించాడు. ఈ క్రమంలో గోవింద్‌తో కూడా ధర్మయ్య గొడవపడ్డాడు. నెల రోజుల క్రితం ఇదే విషయంగా ఇద్దరు ఘర్షణ పడ్డారు. అప్పట్లో హతమారుస్తానని గోవింద్‌ హెచ్చరించాడు. దీంతో ధర్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివాదం పెద్దది కావడంటో గ్రామపెద్దలు ఇద్దరిని రాజీ చేశారు. భారతి తనకు దూరమైందని ఆక్రోశంతో ఉన్న గోవింద్‌ శనివారం రాత్రి ధర్మయ్య ఇంటికి వచ్చాడు. దీంతో భార్యభర్తలు ఇద్దరు కలిసి గోవింద్‌ను చితకబాదారు. అనంతరం బయటకు వెళ్లిన గోవింద్‌ తిరిగి మచ్చు కత్తితో వచ్చి ధర్మయ్య, భారతీలను దారుణంగా నరికి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఎన్‌ఆర్‌ పురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్‌పీ రవీంద్రనాథ్‌ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. 

>
మరిన్ని వార్తలు