పక్కా ప్లాన్‌తో ఊబర్‌ డ్రైవర్‌ దారుణ హత్య

5 Feb, 2019 10:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : కారును దొంగిలించాలనే కుట్రలో భాగంగా ఊబర్‌ క్యాబ్‌ను బుక్‌ చేసుకున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన భార్యాభర్తలు ఓ డ్రైవర్‌ను దారుణంగా హతమార్చారు. అనంతరం ముక్కలుగా కోసి మురికి కాలువలో పడేశారు. వివరాలు.. తూర్పు ఢిల్లీలోని శాఖార్‌పూర్‌లో నివాసముండే రామ్‌గోవింద్‌ ఊబర్‌లో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత మంగళవారం ఢిల్లీలోని ఎంజీ రోడ్డు నుంచి ఘజియాబాద్‌కు ఫర్హాత్‌ అలీ (35, సీమా శర్మ (30) దంపతులు క్యాబ్‌ బుక్‌ చేసుకున్నారు. ఘజియాబాద్‌కు చేరుకోగానే గోవింద్‌ను తమ ఇంటికి ఆహ్వానించారు. ముందుగా అనుకున్న ప్లాన్‌ ప్రకారం గోవింద్‌కు టీలో మత్తుమందు కలిపి ఇచ్చారు. అనంతరం అతన్ని గొంతు నులిమి హత్య చేశారు. మరునాడు మృతదేహాన్ని ముక్కలుగా కోసి మూడు సంచుల్లో ప్యాక్‌ చేసి నొయిడాలోని మురికి కాలువలో పడేశారు.

తప్పుదారి పట్టించారు..
జనవరి 29న డ్యూటీ నిమిత్తం వెళ్లిన తన భర్త ఇంటికి తిరిగి రాకపోవడంతో గోవింద్‌ భార్య శాఖార్‌పూర్ పోలిస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, గోవింద్‌ను హత్య చేసిన అనతరం నిందితులు తెలివిగా వ్యవహరించారు. మృత దేహాన్ని పడేసిన తర్వాత క్యాబ్‌ను యథావిధిగా నడిపించారు. పోలీసులకు దర్యాప్తు సవాల్‌గా మారింది. మదాంగిర్‌ నుంచి కాపాషిరాలో కారు చివరగా బుక్‌ అయినట్టుగా పోలీసులు తెలుసుకున్నారు. అక్కడి నుంచి కారులోని జీపీఎస్‌ పరికరం పనిచేయడం ఆగిపోయింది. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఫర్హాత్‌ దంపతులను మెహ్రౌలి-గురుగ్రామ్‌ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నిందితులు ఫర్హాత్‌ అలీ, సీమా శర్మ నేరాన్ని అంగీకరించారని తూర్పు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్‌ వైజయంత ఆర్యా వెల్లడించారు. సాంకేతిక సహాయంతో గోవింద్‌ మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు