ఇద్దరి పిల్లలను కడతేర్చి దంపతుల ఆత్మహత్య

15 Sep, 2018 10:40 IST|Sakshi
మృతి చెందిన కుటుంబం

చెన్నై, అన్నానగర్‌: నెల్లై సమీపంలో గురువారం ఇద్దరు పిల్లలను కడతేర్చి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో దొరికిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. విరుదునగర్‌ జిల్లా శివకాశి సమీపంలోని తిరుత్తంగల్‌కి చెందిన మహేం ద్రన్‌ (38)కు భార్య రేవతి (28),  కుమారుడు కదిర్‌వేల్‌ (07), కుమార్తె అస్మితా (03) ఉన్నారు. మహేంద్రన్‌ తిరుప్పూరులో ఉన్న ఓ బనియన్‌ కంపెనీలో పని చేస్తున్నాడు.  ఈ స్థితిలో మహేంద్రన్‌ కామెర్ల వ్యాధితో బాధపడుతున్నాడు. అతను చికిత్స కోసం గత 15 రోజుల క్రితం కుటుంబంతో నెల్లైలో ఉన్న అత్తగారింటికి వచ్చారు. పక్క ఇంట్లోనే∙నివాసముంటున్నారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట అయినా ఎవరూ బయటకు రాలేదు. 

రేవతి తల్లి పిచ్చమ్మాళ్‌ తలుపులను తెరచి లోపలికి వెళ్లింది. అక్కడ మహేంద్రన్, రేవతి, కదిర్‌వేల్, అస్మితా మృతి చెంది ఉండడం చూపి షాక్‌కు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరకున్నారు.  పాలులో విషం కలిపి పిల్లలకు ఇచ్చి ఆపై  ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిసింది.  నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం పాళయంకోట ఐకిరవుండు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహేంద్రన్‌ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన ఓ ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘అందులో కామెర్లతో బాధపడుతున్న నేను ఇక బతకను. నన్ను విడిచి నా భార్య జీవించదు. దీంతో మేం కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటున్నాం’ అని రాసి ఉంది. అనంతరం విక్రమసింగపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు