కూతురు పుస్తకాల కోసం వెళ్లి..

16 Sep, 2019 11:07 IST|Sakshi
మృతి చెందిన రాములు, విజయ(ఫైల్‌)

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

తాళ్లగూడెం స్టేజీ వద్ద ఘటన

సాక్షి, ఆలేరు: తమ చదువులు అంతంత మాత్రమే అయినా కూతుళ్లు ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు ఆ తల్లిదండ్రులు. పెద్ద కూతురుకి అవసరమైన డిగ్రీ పుస్తకాల కోసం ద్విచక్ర వాహనంపై భువనగిరికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనగా మృత్యురూపంలో వచ్చిన కారు ఢీ కొనడంతో తల్లిదండ్రులు చనిపోగా, వారి కూతురు తీవ్ర గాయాలతో హైదరాబాదులోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. హైదరాబాదు–వరంగల్‌ హైవేపై యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెం స్టేజీ సమీపంలో శనివారం రాత్రి కారు ఢీకొన్న సంఘటనలో ఆలేరు ఎస్సీ కాలనీకి చెందిన భార్యాభర్తలు జంగిటి రాములు, విజయ చనిపోగా, వారి కూతురు స్వప్న తీవ్ర గాయాలతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విధి తమే. జనగామ జిల్లా నారాయణపురానికి చెందిన పెద్ద నర్సయ్య కుటుంబం  45 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం ఆలేరుకు వలసవచ్చారు. వారి కుమారుడైన జంగిటి రాములు స్థానికంగా తాపీ పని చేస్తుండగా, భార్య విజయ కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు కూతుళ్లను పోషించుకుంటున్నారు.

పెద్ద కూతురు స్వప్న ఆలేరులోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండో ఏడాదిలో ఉండగా, చిన్న కూతురు కావేరి 10 వ తరగతి చదువుతుంది. అయితే పెద్ద కూతురు స్వప్న డిగ్రీ చదువుకు అవసరమైన పుస్తకాలను అడగడంతో శనివారం సాయంత్రం వరకు భార్యాభర్తలు పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత కూతురుని తీసుకుని ద్విచక్ర వాహనంపై భువనగిరికి వెళ్లారు. తిరుగు ప్ర యాణంలో మరో పది నిమిషాల వ్యవధిలో ఆ లేరుకు చేరుకుంటామని అనుకుంటున్న క్రమంలో వరంగల్‌ వైపు నుంచి వస్తున్న కారు ఢీ కొట్టడంతో భార్య విజయ అక్కడికక్కడే చనిపోగా తీవ్ర గాయాలకు గురైన భర్త రాములు, కూతురు స్వప్నను భవనగిరి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాములు చనిపోగా కూతురు కాళ్లు విరిగి చికిత్స పొందుతుంది. వరంగల్‌ వైపు నుంచి వస్తున్న కారు అతి వేగమే బార్యాభర్తల ప్రాణాలు బలిగొన్నట్లు తెలుస్తోం ది. కారు డ్రైవరు మితిమీరిన వేగంతో వస్తూ ముందు ఉన్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనంను ఢీ కొనడంతోనే ఈ  ఘటన జరిగింది.  తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు అమ్మాయిలకు దాదాపు 70 ఏళ్ల వయస్సున్న నానమ్మ లక్ష్మియే దిక్కుగా మారింది.  

రాస్తారోకో...
ప్రభుత్వ నుంచి సహాయం అందించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్సీ కాలనీ వాసులతో పాటు స్థానికులు వందలాది మంది ఆలేరు రైల్వే గేటు వద్ద మృతదేహాలతో రాస్తారోకో చేశారు.  రాస్తారోకోతో జాతీయ రహదారిపై రెండు వైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఎమ్మార్పీస్‌ రాష్ట్ర కార్యదర్శి కందుల శంకర్‌ మాదిగ, టీఆర్‌ఎస్‌ నాయకులు చింతకింది మురళి, సీపీఎం నాయకులు మంగ నర్సింహులు, ఎంఎ ఇక్బాల్, సత్యరా జయ్య, ఎంఎల్‌ నాయకులు అడవయ్య, కేమిడి ఉప్పలయ్య,  బాబు, చంద్రయ్య తదితరులు రా స్తారోకోలో పాల్గొన్నారు.  విషయాన్ని పోలీసులు ఫోన్‌ ద్వారా ఆర్డీఓ వెంకటేశ్వర్లు దృష్టికి తీ సుకు రాగా కారు డ్రైవరును వెంటనే అరెస్టు చేస్తామని, చికిత్స పొందుతున్న స్వప్నకు మం చి వైద్యం అందేలా చూస్తామని, ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందేలా చూస్తామని హమీ ఇచ్చారు. అంత్యక్రియలకు ఆలేరు తహసీల్దారు కార్యాలయం నుంచి రూ.5వేలు అందజేశారు. 

మరిన్ని వార్తలు