పురుగుల మందు తాగి జంట ఆత్మహత్యాయత్నం

29 Mar, 2018 08:29 IST|Sakshi

కంకిపాడు (పెనమలూరు):  పెళ్లి ఆలస్యం అవుతుండటంతో ఓ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కంకిపాడులో బుధవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాలు, పోలీసుల కథనం ప్రకారం....గుడ్లవల్లేరు మండలం పెంజెండ్రకు చెందిన పఠాన్‌ షఫీఉల్లా ఖాన్‌కు విజయవాడ సనత్‌నగర్‌కు చెందిన పర్వీన్‌కు ఈ ఏడాది జనవరి 28న నిశ్చితార్ధం జరిగింది. బుధవారం మధ్యాహ్నం ఈ ఇరువురూ కంకిపాడులోని పంట పొలాల్లోకి వెళ్లి పురుగుల మందు కూల్‌డ్రింక్‌ బాటిల్‌లో కలుపుకుని తాగారు. అయితే ప్రాణభయంతో మోటరుసైకిల్‌పై కంకిపాడు సీహెచ్‌సీకి వైద్యం నిమిత్తం చేశారు. ఆరోగ్య సిబ్బంది ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కంకిపాడు పోలీసులు కంకిపాడు సీహెచ్‌సీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ యువతీ, యువకుడి నుంచి వివరాలు సేకరించారు. పెళ్లి ఆలస్యం అవడం, పెళ్లి జరుగుతుందో, లేదో అనే భయంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఇరువురి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు