‘భోపాల్‌’ రేప్‌ దోషులకు యావజ్జీవం!

24 Dec, 2017 02:53 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ యువతి(19)పై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డ కేసులో నలుగురు దోషులకు ఇక్కడి సెషన్స్‌ కోర్టు శనివారం యావజ్జీవశిక్ష విధించింది. గోలూ(25), అమర్‌(24), రాజేశ్‌(26), రమేశ్‌ మెహ్రా(45)లు మిగిలిన తమ జీవితమంతా జైలులో గడపాలని అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి సవితా దూబే తీర్పునిచ్చారు. భోపాల్‌లో అక్టోబర్‌ 31న సివిల్స్‌ కోచింగ్‌కు వెళ్లి తిరిగివస్తున్న బాధితురాలిపై ఈ నలుగురు హబీబ్‌గంజ్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదులో పోలీసుల అలసత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో అప్పట్లో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఐదుగురు అధికారుల్ని సస్పెండ్‌ చేసింది. అనంతరం ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌ 15 రోజుల్లో విచారణను పూర్తిచేసింది. రోజువారీ విచారణ జరపాలన్న మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలతో సెషన్స్‌ కోర్టు రికార్డు స్థాయిలో నేరం జరిగిన 52 రోజుల్లోనే తీర్పు వెలువరించింది. 

మరిన్ని వార్తలు