బాలికపై లైంగికదాడి కేసులో పదేళ్ల జైలు 

10 Dec, 2019 09:03 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, హిందూపురం/అనంతపురం: ఫోక్సో కేసులో ముద్దాయికి పదేళ్లు జైలు, రూ.2వేల జరిమానా, బాధితురాలికి రూ.25వేలు పరిహారం చెల్లించేలా అనంతపురం ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ జడ్జి తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళితే.. 2016, నవంబర్‌1వ తేదీ హిందూపురం సమీపంలోని మోత్కుపల్లి గ్రామానికి చెందిన మూగ, చెవిటి బాలిక కనిపించకుండా పోయింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ ఈదూర్‌బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కర్ణాటక రాష్ట్రం గౌరిబిదనూర్‌ తాలూకా మంచేపల్లికి చెందిన ఎం.రాజు ఓ పని నిమిత్తం  గ్రామానికి వచ్చి బాలికను నమ్మించి కిడ్నాప్‌ చేసినట్లు గుర్తించారు. గ్రామానికి వెళ్లి అతని చెరలో ఉన్న బాలికను విడిపించి, ఆమెపై జరిగిన అత్యాచారం ఘటనకు సంబంధించి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఎం. రాజును అరెస్ట్‌ చేశారు. అనంతరం వచ్చిన సీఐ చిన్న గోవిందు ఈ కేసులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. అన్ని కోణాల్లో ఈ కేసును సమగ్రంగా విచారించిన న్యాయమూర్తి సోమవారం తుది తీర్పు వెలువరించారు.  ప్రాసిక్యూషన్‌ తరఫు  న వాదనలను అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బుడెన్‌సాహెబ్‌ వినిపించారు.

మరిన్ని వార్తలు