బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

1 Aug, 2019 08:21 IST|Sakshi

‘జబర్దస్త్‌’ సినిమా కాపీ చేశారని ఫిర్యాదు

 రూ.3.5 కోట్ల కోసం కోర్టుకు టీవీ ఛానల్‌

 అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన న్యాయస్థానం

సాక్షి, హైదరాబాద్‌: సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. తమకు చెల్లించాల్సిన రూ.3.5 కోట్లను తిరిగి ఇవ్వటంలో విఫలమయ్యారని ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ కోర్టును ఆశ్రయించగా ఈ మేరకు అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. 2010లో యష్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మించిన ‘బాండ్‌ బాజా బరాత్‌’ సినిమా హిందీలో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 2013 బెల్లకొండ సురేష్‌ సిద్ధార్థ్‌, సమంత హీరో హీరోయిన్లుగా జబర్దస్‌ అనే సినిమాను నిర్మించారు. అందులో 19 సీన్లు కాపీ చేశారని ఆరోపిస్తూ యష్‌రాజ్‌ ఫిలింస్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సినిమా ప్రదర్శనను నిలిపేసింది. 

అయితే జబర్దస్త్‌ సినిమా నిర్మాణంలో  ఉండగానే టెలివిజన్‌ శాటిలైట్‌ టెలీకాస్ట్‌ రైట్స్‌ను రూ.3.5 కోట్లకు ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌ విక్రయించారు. యష్‌రాజ్‌ ఫిలింస్‌ ఫిర్యాదు మేరకు సినిమా ప్రదర్శన నిలిపేయటంతో పాటు టెలివిజన్‌లోనూ టెలికాస్ట్‌ చేయవద్దని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సదరు టీవీ ఛానెల్‌కు ఆ మొత్తాన్ని బెల్లంకొండ సురేష్‌ తిరిగి చెల్లించాల్సి ఉన్నప్పటికి ఆరేళ్లుగా రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తుండటంతో ఛానెల్‌ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. అయితే బెల్లంకొండ తీసుకున్న రూ.3.5 కోట్ల మొత్తం ప్రస్తుతం రూ.11.75 కోట్లకు చేరింది. ఈ మేరకు కోర్టు బెల్లంకొండపై అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేసింది. 

మరిన్ని వార్తలు