ఆవుపైనా అమానుషత్వం

7 Jun, 2020 05:19 IST|Sakshi

సిమ్లా: కేరళలో పైనాపిల్‌లో పేలుడుపదార్థాలు పెట్టి దాంతో ఏనుగును హతమార్చిన అమానవీయ ఘటనను మరువకముందే హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో ఆవు నోట్లో టపాసులు పెట్టి, అలాంటి దారుణానికే ఒడిగట్టారు దుండగులు. ఝన్‌దూతలోని ఓ సూడి ఆవు నోట్లో టపాసులు పెట్టి పేల్చడంతో ఆవుకి తీవ్రగాయాలయ్యాయి. నోరంతా రక్తసిక్తమైన ఆవు ఏమీ తినలేక అవస్థపడుతోంది. ఆవు యజమాని గురు దయాళ్‌æ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది. ఆవుపై దాడికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని ఆవు యజమాని కోరారు.

ఈ ఘటనకు తన పొరుగున నివసించే నందాలాల్‌ కారణమని ఆరోపించారు. పది రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. యానిమల్‌ క్రూయాలిటీ యాక్టు కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేరళలోని పాలక్కాడ్‌లో టపాసులు పెట్టిన పైనాపిల్‌ తినడంతో ఏనుగు మరణించిన ఘటన తర్వాత యానిమల్‌ క్రూయాలిటీ యాక్ట్‌ను చేశారు. పేలుడు ధాటికి ఏనుగు తీవ్రంగా గాయపడటంతో కొన్ని రోజులపాటు ఏమీ తినలేక, నొప్పి నుంచి ఉపశమనం కోసం నీటిలోనే ఉండి చనిపోయింది. ఈ ఘటనలో సంబంధం ఉన్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు