అనుమానించాడు.. హతమార్చాడు

23 Aug, 2019 08:55 IST|Sakshi

భార్య శీలాన్ని శంకించిన భర్త

కొడవలితో హత్య చేసి పరారీ 

దొడ్డబళ్లాపురం : భార్య శీలాన్ని శంకించిన భర్త అనుమానం పెనుభూతమై ఆమెను కొడవలితో నరికి హత్యచేసి పరారైన సంఘటన మాగడి తాలూకా హాలశెట్టిహళ్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నెలమంగల తాలూకా చిక్కనాయకనపాళ్య గ్రామానికి చెందిన మంజుల, రేవణ్ణ దంపతుల కుమార్తె పూర్ణిమ (24)హత్యకు గురైంది.  పూర్ణిమను 2018 నవంబర్‌లో మాగడి తాలూకా హాలశెట్టిహళ్లికి చెందిన గంగాధరయ్య కుమారుడు నాగరాజుకు ఇచ్చి వివాహం జరిపించారు. పూర్ణిణమ బెంగళూరులోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేసేది. నాగరాజు గ్రామంలోనే వ్యవసాయం చేసుకునేవాడు. 

ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న నాగరాజు నిత్యం ఆమెతో గొడవపడేవాడు. బుధవారం సాయంత్రం భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నాగరాజు ఆవేశం పట్టలేక కొడవలితో భార్యను నరికి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుండి పరారయ్యాడు. బయటకు వెళ్లిన నాగరాజు తండ్రి గంగాధరయ్య రాత్రి ఇంటికి వచ్చి చూడగా పూర్ణిమ రక్తం మగుడులో కనిపించింది. సమాచారం అందుకున్న సీఐ రవికుమార్, ఎస్సై వెంకటేశ్‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నాగరాజు కోసం గాలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు