తప్పించుకోలేరు!

13 Apr, 2018 12:42 IST|Sakshi
ఎస్పీ కార్యాలయంలో సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్న పోలీస్‌ సిబ్బంది

వనపర్తి జిల్లాలో 190సీసీ కెమెరాల ఏర్పాటు

దొంగతనం, రోడ్డు ప్రమాదాల్లో కీలక ‘నేత్రాలు’

ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారులు ఏర్పాటు   చేసుకునేందుకు   పోలీసుల సూచన

వనపర్తి క్రైం: దోపిడీలు, రోడ్డు ప్రమాదాలు, ఇతర ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, గొడవలు చోటుచేసుకున్నా ఆ పరికరాల సహాయంతో ఇట్టే పట్టేసుకోవచ్చు.. ఇప్పటికే ఎన్నో కేసుల్లో కీలక సమాచారం సేకరించి నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నారు.. ఈ నేపథ్యంలో ఆర్థిక నేరాలు, దొంగతనాలు, ఇతర ఘటనలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని.. వనపర్తి జిల్లావ్యాప్తంగా కొత్తగా 190 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే వ్యాపారులు, ఇతర ప్రైవేట్‌ వ్యక్తులు సైతం సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు సూచనలు ఇస్తున్నారు.

వందమందితో సమానం
ఆర్థిక నేరాలు, దొంగతనాలపై జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ప్రత్యేకంగా దృష్టిసారించడంతో ప్రజలకు భద్రతపై నమ్మకం ఏర్పడింది. ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులకు సమానమని పోలీసులు భావిస్తున్నారు. అందుకే జి ల్లాకేంద్రంలోని ప్రధాన కేంద్రాల్లో వీటి ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీ సుకుంటున్నారు. ఇందులో భాగంగానే వనపర్తి జిల్లాలో 190 సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేశారు. జిల్లాకేంద్రంలో 55 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. 

ప్రజలు సహకరించాలి..
సీసీ కెమెరాలతో నేరాలను చాలా వరకు కట్టడి చేయవచ్చు. నేరం చేస్తే వెంటనే దొరికిపోతారు. జిల్లాకేంద్రం అంతా సీసీ నిఘూ కిందకు తెçస్తున్నాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వ్యాపార కేంద్రాలు, విద్యాసంస్థలు, ప్రధాన కాలనీల్లో ఏర్పాటు చేసుకోవాలి. కేసుల పరిశోధనలో సీసీ కెమెరాలు చాలా కీలకంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే పెబ్బేరు 50, కొత్తకోటలో 60, ఆత్మకూర్‌లో 20, గోపాల్‌పేటలో 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.– వెంకటేశ్వర్లు, సీఐ, వనపర్తి

నేరాలు తగ్గుముఖం..
çసీసీ కెమెరాల ఏర్పాటుతో జిల్లాలో కొంత వరకు దొంగతనాలు తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. నేనుసైతం కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్‌ శాఖ ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గతంలో వనపర్తి జిల్లాకేంద్రంలో 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ టీవీలతో దొంగతనాలను అరికట్టడంతోపాటు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్ష్యాలుగా మారుతున్నాయి. విజువల్స్‌ ఆధారంగా ప్రమాదం ఎలా జరిగింది.. ఎప్పుడు జరిగిందనే అంశాలు తేలిగ్గా తెలిసిపోతున్నాయి. సీసీ కెమెరాలతో చైన్‌ స్నాచింగ్‌లు తగ్గుముఖం పట్టాయి. వాహనాలు దొంగించినా వాటి నంబర్ల ఆధారంగా పోలీసులు పట్టుకుంటున్నారు. ఫలితంగా తప్పు చేస్తే దొరికిపోతామన్న భయం దొంగల్లో నెలకొంది. కిడ్నాప్, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారు సైతం వెనక్కి తగ్గుతున్నారు. సీసీ టీవీలకు ఎస్పీ కార్యాలయంలో కమాండింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు.

పెరిగిన పెట్రోలింగ్‌
వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతిఒక్కరూ ఆరుబయట, మిద్దెలపైనే పడుకుంటారు. దీంతో ఇళ్లలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయి. దొంగతనాలు జరగకుండా ఉండేందుకు పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్‌ తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఖ్యంగా బస్టాండ్‌లో పిక్‌పాకెటింగ్‌ జరగకుండా పోలీసులు ప్రత్యేక నిఘూ ఉంచారు. పెట్రోలింగ్‌ ద్వారా ఇప్పటి వరకు దొంగ తనం చేసే ఆరుగురిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఒకవైపు కార్డెన్‌ సెర్చ్, పెంట్రోలింగ్‌ తనిఖీలు చేపట్టడంతో భద్రతపై ప్రజలకు నమ్మకం ఏర్పడింది.

మరిన్ని వార్తలు