అమ్మాయిలను సమకూరుస్తామంటూ మోసాలు.. అరెస్టు

25 Sep, 2018 19:54 IST|Sakshi
సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : డేటింగ్‌ రాకెట్‌ను నిర్వహిస్తున్న ఐదుగురు బెంగాలీలను సైబర్‌క్రైం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితులు టెలీకాలర్స్‌ పేరుతో యువతుల్ని జాబ్‌లో చేర్పించుకుని డేటింగ్‌ సైట్లను నిర్వహిసున్నారని సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. భారీ స్థాయిలోకాల్‌ సెంటర్లు ఏర్పాటు చేసి డేటింగ్‌ రాకెట్‌ నడుపుతున్నారని వెల్లడించారు. ముఠా సూత్రధారి దేబశిష్‌ ముఖర్జీతో సహా ఫజుల్‌ హాక్‌, సందీప్‌ మిత్ర, యువతులు అనిత డెయ్‌, నీత శంకర్‌లను అరెస్టు చేశామని తెలిపారు.

గెట్‌ యువర్‌ లేడీ, వరల్డ్‌ డేటింగ్‌, మై లవ్‌ పేర్లతో డేటింగ్‌ సైట్లు క్రియేట్‌ చేసి యువతుల్ని సమకూరుస్తామంటూ.. వేలకు వేలు డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించామన్నారు. 20 కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసి అమాయకులను బురిడీ కొట్టించారని పోలీసులు తెలిపారు. కాల్‌ సెంటర్లకు సంబంధించిన మెటీరియల్‌ సీజ్‌ చేశామని తెలిపారు. అపరిచిత కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ మోసాలకు బలికావద్దని ప్రజలకు కమిషనర్‌ సూచించారు.

మరిన్ని వార్తలు