మాట్రిమోని డాక్టర్‌ అలా దొరికిపోయాడు

12 Jan, 2020 10:34 IST|Sakshi

పెళ్లి పేరిట నగదు స్వాహా 

నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణ): మాట్రిమోనియల్‌ సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసి యువతులను మోసగించిన యువకుడిని సైబర్‌ క్రైం పోలీసులు శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సైబర్‌ క్రైం సీఐ వి.గోపీనాథ్‌ తెలిపిన వివరాలు.. తెలంగాణ రాష్ట్రం లోని ఖమ్మం జిల్లా సింగరేణి సూర్యా తండాకు చెందిన బానోతు సాయినాథ్‌ అలియాస్‌ సాయినాథ్‌రెడ్డి  కరీంనగర్‌లో డాక్టర్‌ పనిచేస్తున్నానని చెప్పి మాట్రిమోనియల్‌ సైట్‌లో తన ప్రొఫైల్‌ అప్‌లోడ్‌ చేశాడు.

ఆ ప్రొఫైల్‌ను గమనించిన విశాఖకు చెందిన ఇద్దరు యువతులు అతనితో పరిచయం ఏర్పరుచుకున్నారు. వారిని పెళ్లి చేసుకుంటానని సాయినాథ్‌ నమ్మించాడు. తనకు మెడికల్‌ ఎమర్జెన్సీ వచ్చిందని చెప్పి ఓ యువతి నుంచి రూ.1.05లక్షలు, మరో యువతి నుంచి రూ.50వేలు తన అకౌంట్‌లో వేయించుకున్నాడు. తర్వాత సాయినాథ్‌ అందుబాటులోకి రాకపోవడంతో యువతులు మోసపోయామని గ్రహించి గతేడాది ఆగస్టు 22న ఒకరు, డిసెంబర్‌ 9న  మరొఒకరు సైబర్‌ క్రైం పోలీస్‌ సేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాయినాథ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
 
విచారణలో మరిన్ని మోసాలు వెలుగులోకి..
ఈ మేరకు నిందితుడిని విచారించగా విచారణలో హైదరాబాద్‌కు చెందిన మరో యువతిని మోసగించి రెండు లక్షల వరకు డబ్బులు తీసుకున్నట్టు తెలిపారు. అదే విధంగా బెంగళూరుకు చెందిన మరో యువతి నుంచి  కూడా డబ్బులు తీసుకున్నట్లు తేలిందన్నారు.  

>
మరిన్ని వార్తలు