కారు గిఫ్ట్‌గా వచ్చిందని..

11 Mar, 2020 08:33 IST|Sakshi

ఓ యువతికి సైబర్‌ నేరగాళ్ల టోకరా

సాక్షి, సిటీబ్యూరో: ఓ వైబ్‌సైట్‌లో ఇయర్‌ఫోన్లు ఖరీదు చేసిన యువతికి కారు గిఫ్ట్‌గా వచ్చిందంటూ  సైబర్‌ నేరగాళ్లు టోకరా వేశారు. బాధితురాలు మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో సదరు వెబ్‌సైట్‌ నుంచి కస్టమర్ల డేటా లీక్‌ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తర మండల పరిధిలోని తుకారాంగేట్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి పది రోజుల క్రితం షాప్‌క్లూస్‌ నుంచి రూ.500 వెచ్చించి ఇయర్‌ఫోన్లు ఖరీదు చేశారు. ఇవి డెలివరీ అయిన తర్వాత ఆమెకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. అవతలి వాళ్లు తాము షాప్‌క్లూస్‌ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకున్నారు. మీరు ఇటీవల తమ సంస్థ నుంచి వస్తువలు కొనుగోలు చేశారు కదా అని చెప్పడంతో ఆమె నమ్మింది. తమ కస్టమర్ల కోసం లక్కీ డ్రా నిర్వహించామని అందులో మీకు రూ.12.6 లక్షల విలువైన కారు గెల్చుకున్నారని చెప్పి ఆమెకు ఎర వేశారు.

బాధితురాలు నిజమేనని నమ్మి ఆ కారును ఎలా పొందాలంటూ అడిగారు. కారు డెలివరీ చేయడం కోసం కొన్ని పన్నులు చెల్లించాల్సి ఉందంటూ చెప్పిన సైబర్‌ నేరగాళ్లు అసలు ‘పని’ ప్రారంభించారు. దాదాపు పది రోజుల పాటు వివిధ ట్యాక్స్‌ల పేరు చెబుతూ ఆమె నుంచి రూ.68,900 వివిధ ఖాతాల్లోకి డిపాజిట్‌ చేయించుకుని మోసం చేశారు. ఎట్టకేలకు తాను మోసపోయానని గుర్తించిన బాధిత యువతి మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు వినియోగించిన ఫోన్‌ నెంబర్, డబ్బు డిపాజిట్‌ చేయించుకున్న ఖాతాల వివరాల ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి నేరాలు తరచు చోటు చేసుకుంటున్నాయని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం నేరుగా ఏ స్థాయిలో క్రయవిక్రయాలు జరుగుతున్నాయో... దాదాపు అదే స్థాయిలో ఆన్‌లైన్‌లో వస్తువులు విక్రయించే వెబ్‌సైట్లు, యాప్స్‌లో పుట్టుకువచ్చాయి. వీటిలో పని చేస్తున్న కొందరు నేరగాళ్లు తమ వద్ద షాపింగ్‌ చేసిన కస్టమర్ల వివరాలు, ఫోన్‌ నంబర్లకు సైబర్‌ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. వీటి ఆధారంగా బాధితులకు ఫోన్లు చేస్తున్న సైబర్‌ క్రిమినల్స్‌ వారి షాపింగ్‌ వివరాలు చెప్పి బుట్టలో పడేస్తున్నారు. ఆపై గిఫ్ట్‌లు పొందడానికి పన్నులు, ఇతర చార్జీల పేర్లు చెప్పి అందినకాడికి దండుకుంటున్నారని వివరిస్తున్నారు. ఈ తరహా ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్స్, ఎస్సెమ్మెస్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు