బురిడీ కొట్టించడానికి...

4 Apr, 2020 08:43 IST|Sakshi

బోగస్‌ యూపీఐ ఐడీలను క్రియేట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు

సుమోటోగా కేసు నమోదు  

సాక్షి, సిటీబ్యూరో: కరోనా సహాయక చర్యల కోసం ప్రధాన మంత్రి ఏర్పాటు చేసిన సహాయ నిధి తరహాలో సైబర్‌ నేరగాళ్లు నకిలీది రూపొందించి విరాళాలు కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిని గమనించిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం సుమోటోగా కేసు నమోదు చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చే వారి కోసం భారత ప్రభుత్వం ఎస్‌బీఐ బ్యాంకు ద్వారా యూపీఐ ఐడీని క్రియేట్‌ చేసింది.  pmcares@sbi పేరుతో ప్రస్తుతం ఇది అందుబాటులో ఉంది. దీనికి విరాళాల వెల్లువెత్తుతుండటంతో సైబర్‌ నేరగాళ్లు రంగంలోకి దిగారు.

కరోనా సహాయ చర్య కోసం నిధులు అందించే దాతల్ని బురిడీ కొట్టించడానికి ఆరు బోగస్‌ యూపీఐ ఐడీలను సృష్టించారు. pmcares@pnb,pmcares@hdfcbank, pmcare@yes bank, pmcare@ybl, pmcare@upi, pmcare@sbi, pmcares@icici' పేర్లతో ఇవి చెలామణి అవుతున్నాయి. ఈ యూపీఐ ఐడీలను పేర్కొంటూ సైబర్‌ నేరగాళ్లు ప్రతి నిత్యం వేల మందికి ఎస్సెమ్మెస్‌లు పంపుతూ.. కాల్‌ సెంటర్ల పేరుతో ఫోన్లు చేసి విరాళాలను కాజేస్తున్నారు. ఈ నకిలీ ఖాతాల్లోకి బదిలీ చేసిన డబ్బు నేరగాళ్లకు చేరుతుందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ సూచిస్తున్నారు. పీఎం కేర్స్‌కు విరాళం ఇవ్వాలని భావించిన వారు pmindia.gov.in వెబ్‌సైట్‌ను వీక్షించాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు