క్రెడిట్‌ స్కోర్‌ పెంచుతామని మోసాలు

8 Feb, 2020 13:05 IST|Sakshi

బ్యాంక్‌ ఖాతాదారులు జాగ్రత్తలు పాటించాలి

జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప

కర్నూలు: క్రెడిట్‌ కార్డు ఆధారంగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, బ్యాంక్‌ ఖాతాదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. బ్యాంక్‌ నుంచి కాల్‌ చేస్తున్నామని ఖాతాదారులను సంప్రదించి క్రెడిట్‌ కార్డు స్కోర్‌ తక్కువగా ఉందని, దాన్ని పెంచి అధిక మొత్తంలో షాపింగ్‌ చేసేందుకు, ఎక్కువగా రుణ సౌకర్యం పొందేందుకు వీలు కల్పిస్తామని నమ్మించి కార్డు వివరాలు తెలుసుకొని మోసాలకు పాల్పడుతున్నారని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. క్రెడిట్‌ కార్డుపై ఉన్న పదహారు సీవీవీ అంకెలు ఎక్స్‌పేర్‌ డేట్‌ వివరాలు తెలుసుకొని తద్వారా అవసరమున్న మేరకు వస్తువులను ఆన్‌లైన్‌ ద్వారా నేరగాళ్లు కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. కర్నూలు నగరం దేవనగర్‌కు చెందిన ఓ వ్యక్తిని ఇదే తరహాలోనే సైబర్‌ నేరగాళ్లు నమ్మించి మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. ఫోన్‌కాల్‌ ద్వారా సంప్రదించి క్రెడిట్‌ కార్డుస్కోర్‌ పెంచుతామని నమ్మించి మోసానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. స్కోర్‌ పెంచుకోవడంతో మీకు లభించే రివార్డు పాయింట్స్‌ వల్ల బ్యాంక్‌కు తిరిగి కట్టవలసిన డబ్బులు కూడా తగ్గుతుందని నమ్మించి కార్డు వివరాలను తెలుసుకొని తద్వారా రూ.1.26 లక్షల విలువ గల వస్తువులను ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేశారని తెలిపారు. క్రెడిట్‌ కార్డు ద్వారా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసిన వివరాలు తన మెయిల్‌ ద్వారా తెలుసుకున్న బాధితుడు మోసపోయినట్లు గ్రహించి పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడని తెలిపారు.

మరిన్ని వార్తలు