క్యూనెట్‌ గుట్టు రట్టు.. 58 మంది అరెస్టు

8 Jan, 2019 15:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డబ్బు ఆశ చూపి వేల సంఖ్యలో బాధితులకు కుచ్చుటోపి పెట్టిన క్యూనెట్ మోసగాళ్లను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగులను, అమాయకులను ట్రాప్‌ చేసి చైన్ సిస్టమ్ ద్వారా ప్రైజ్ మనీ, కమీషన్లు వస్తాయంటూ నమ్మించి మోసాలకు పాల్పడిన 58 మంది కేటుగాళ్లను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి ఇచ్చిన పిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ(ఎకానిమిక్స్ అఫెన్స్ వింగ్) అధికారులు మల్టిలెవల్ మార్కెటింగ్‌ గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు. సైబరాబాద్‌ పరిధిలో క్యూనెట్‌ మోసంపై 14 కేసుల నమోదయినట్టు పోలీసు కమిషనర్ సజ్జనార్ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా క్యూనెట్‌ బ్యాంకు అకౌంట్లను, గోదాంలను సీజ్‌ చేసినట్లు వివరించారు. అరెస్టు చేసిన 58 మందిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటికే క్యూనెట్‌ చైర్మన్‌ మైకెల్‌ ఫెరారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. 

రూ.1000 కోట్ల మోసం
బిజినెస్‌ ప్లాన్‌ ఉందని అమాయక, నిరుద్యోగ యువకులను టార్గెట్‌ చేస్తూ ముగ్గులోకి దింపి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కేటుగాళ్లను ఆరెస్టు చేసినట్లు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. పలు రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్న నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం సజ్జనార్‌ పలు విషయాలు వెల్లడించారు. ‘వివధ రకాల కేసుల్లో మొత్తం 58 మందిని అరెస్టు చేశాము. క్యూనెట్‌ సంస్థ సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన మోసాలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ముఠాలో ముగ్గురు బ్యాంక్‌ ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకున్నాం.  2001 నుంచి వీళ్లు వ్యాపారం చేస్తున్నారు. కచ్చితంగా అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అంటూ సజ్జనర్‌ వివరించారు. 

మరిన్ని వార్తలు