కులం పేరుతో దూషణ; ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

6 Sep, 2019 20:29 IST|Sakshi

లక్నో : ఓ వైపు టెక్నాలజీలో మార్పు వచ్చి పరిస్థితులు మారుతున్నా.. మరోవైపు మనుషులు పాత నాగరికతను వీడడం లేదు.  కులం, మతంపై ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఇప్పటికీ కులం పేరుతో ఎంతో మంది దళితులు వేదింపులకు గురవుతూనే ఉన్నారు. కుల పరమైన దూషణలు తట్టుకోలేక ఓ దళితుడు ఆత్మహత్యకు పాల్పడిన అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్‌లో గురువారం చోటు చేసుకుంది.  

వివరాలు.. ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్‌లో త్రివేంద్ర కుమార్‌ అనే వ్యక్తి గ్రామ అభివృద్ది అధికారిగా సేవలంధిస్తున్నారు. విధుల్లో నిమిత్తం గ్రామంలోకి వెళ్లిన అతడిపై స్థానిక రైతు సంఘం నాయకులు, గ్రామ అధికారులు కులపరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక అతను ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా ఆత్మహత్య చేసుకునే ముందు వ్యక్తి సూసైడ్‌ నోట్‌ రాశారు. అందులో స్థానిక నాయకుల నుంచి, కొంత మంది అధికారుల నుంచి తాను కులపరమైన అవమానాలు ఎదుర్కున్నానని పేర్కొన్నారు. దీంతో పాటు తన చావుకు కారణంటూ కొంతమంది పేర్లను కూడా లేఖలో రాశారు.

ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించారు. అయితే ప్రధాన నిందితుడుగా స్థానిక నేత రాకేశ్‌ చౌహన్‌ను గుర్తించారు. ప్రస్తుతం నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, మిగతా నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దీంతోపాటు గతంలో రాకేశ్‌ను కులం పేరుతో కించపరిచిన ఓ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తి విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామన్నారు.

>
మరిన్ని వార్తలు