మూడేళ్లకే తెగిన మూడుముళ్ల బంధం

8 Apr, 2019 11:15 IST|Sakshi
మృతురాలు శిరీషా

సాక్షి, చెన్నూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ దళిత యువతి భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన చెన్నూరు మండలం కొండపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనపై పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని కొండపేట దళితవాడకు చెందిన ఏటూరి శిరీష (20), అదే గ్రామంలోని అగ్రకులానికి చెందిన ఆదినేని సుబ్రమణ్యంలు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించకపోవడంతో 2017లో సుబ్రమణ్యం శిరీషను వివాహం చేసుకుని వేరుగా నివాసం ఉంటున్నాడు. అప్పట్లో శిరీష తల్లిదండ్రులు తమ కుమార్తె తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసుకూడా నమోదైంది. అనంతరం కొద్దిరోజుల తర్వాత శిరీష, సుబ్రమణ్యంలు కొండపేటకు చేరుకుని స్థానికంగా నివాసముండేవారు.

ఈ నేపథ్యంలో మద్యానికి బానిసగా మారిన సుబ్రమణ్యం నిత్యం భార్యతో గొడవపడుతూ పుట్టింటి నుంచి డబ్బులు తీసుకు రావాలని వేధించేవాడు. ఈ క్రమంలో తాజాగా శనివారం కూడా భార్యభర్తలు గొడవ పడ్డారు. దీంతో పుట్టింటికి వెళ్లిన శిరీషాను భర్త  కొండపేటకు తీసుకొచ్చాడు. భర్త వేధింపులతో విసిగి వేశారిపోయిన ఆమె శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌ మార్చురీకి తరలించారు. 

డీఎస్పీ విచారణ : కడప డీఎస్పీ  మాసుంబాషా ఆదివారం మండలంలోని కొండపేటకు వెళ్లి సంఘటన గురించి మృతురాలి తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం చెన్నూరు పోలీసుస్టేషన్‌కు చేరుకుని  ఘటనపై విచారించారు.   

మరిన్ని వార్తలు