దాసరి కోడలు, ఆమె తల్లి అదృశ్యం

27 Jun, 2019 08:53 IST|Sakshi

బంజారాహిల్స్‌: దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు పెద్ద కోడలు దాసరి సుశీల, ఆమె తల్లి సావిత్రమ్మ కనిపించడం లేదని సుశీల సోదరి చిత్తూరు జిల్లా పూతలపట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు హైదరాబాద్‌ వచ్చి వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ నెల 9న దాసరి ప్రభు ఎవరికీ చెప్పకుండా జూబ్లీహిల్స్‌ రోడ్‌నెం–46లోని తన నివాసం నుంచి వెళ్లిపోవడంతో అతడి మామ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టారు. పోలీసులు రెండు వారాల పాటు గాలించినా ప్రయోజనం లేకపోయింది.

అయితే హఠాత్తుగా ఐదు రోజుల క్రితం ఆయన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షం అయ్యారు. తనను కొంతమంది కిడ్నాప్‌ చేసి ముంబై తీసుకెళ్లారని పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు కేసు మూసేసి అతడిని ఇంటికి పంపించారు. ఆయన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన రోజే పెద్ద భార్య సుశీల, సావిత్రమ్మను మాసబ్‌ ట్యాంక్‌లోని ఓ హోటల్‌లో దించినట్లు సుశీల సోదరి చిన్నమ్మ పూతలపట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మాసబ్‌ట్యాంక్‌ నుంచి ప్రభు వెళ్లిపోయిన తరువాత తన సోదరి, తల్లి ఇంటికి రాలేదని వారి ఆచూకీ దొరకడం లేదని చెప్పడంతో అక్కడి పోలీసులు రెండు రోజులుగా  హైదరాబాద్‌లో గాలింపు చేపట్టారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లోనూ కేసు వివరాలపై ఆరా తీశారు.

మరిన్ని వార్తలు