ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

25 Dec, 2019 08:45 IST|Sakshi

గుట్టుచప్పుడు కాకుండా నడిచిన వ్యవహారం

యువతికి పెళ్లి సంబంధాలు చూసిన తల్లిదండ్రులు

ఏకాంతంగా తీసుకున్న వీడియోలతో బ్లాక్‌ మెయిల్‌

కూతురి స్నేహితురాలి చేతిలో హత్యకు గురైన వ్యాపారి

తిరువొత్తియూరులో కలకలం

తమిళనాడు, తిరువొత్తియూరు: వివాహేతర సంబంధం పెట్టుకున్న కూతురి స్నేహితురాలి చేతిలో ఉత్తర చెన్నైకి చెందిన కర్పూరం వ్యాపారి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సోమవారం తిరువొత్తియూరులో చోటుచేసుకుంది. వివరాలు.. సాత్తుమానగర్‌ ప్రాంతానికి చెందిన అమ్మన్‌శేఖర్‌ (54) వ్యాపారి. సొంత ఊరు తూత్తుక్కుడి జిల్లా. కొన్నేళ్ల క్రితం చెన్నైకి వచ్చి స్థిరపడ్డారు. కర్పూరం హోల్‌సేల్‌ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. కుమార్తె సేహితురాలి (25)పై అమ్మన్‌ శేఖర్‌కు లైంగిక వాంఛ కలిగింది. ఈ క్రమంలో యువతికి బహుమతులు ఇస్తూ సన్నిహితంగా మెలిగాడు. తర్వాత  ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంత కాలంగా ఇద్దరూ పలు చోట్లకు వెళ్లి ఉల్లాసంగా గడిపారు.

ఈ క్రమంలో పవిత్రకు ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూశారు. ఈ సంగతి తెలుసుకున్న శేఖర్‌ యువతితో తీసుకున్న ఆశ్లీల వీడియోలు చూపించి వివాహం చేసుకోవద్దని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన యువతి శేఖర్‌ను హత్య చేయడానికి నిర్ణయించుకుంది. సోమవారం ఇద్దరూ బెసంట్‌ నగర్, తదితర ప్రాంతాల్లో ఉల్లాసంగా తిరిగారు. అనంతరం కొత్త చాకలిపేట హార్బర్‌ క్వార్టర్స్‌ క్రీడామైనానం వైపు బైక్‌పై వెళుతున్నారు. ఆ సమయంలో యువతి శేఖర్‌ను బైక్‌ ఆపమని చెప్పింది. నాకొక గిఫ్ట్‌ ఇవ్వాలని కోరింది. అతన్ని కళ్లు మూసుకోమని చెప్పడంతో శేఖర్‌ కళ్లు మూసుకున్నాడు. ఈ క్రమంలో యువతి మత్తు స్ఫ్రేను అతని ముఖంపై చల్లింది. వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుపై పొడిచి పారిపోయింది. అమ్మన్‌ శేఖర్‌ అదేచోట స్ఫృహతప్పి పడిపోయాడు. తర్వాత కొంత సమయానికే మృతి చెందాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి యువతిని అరెస్టు చేశారు. ఇదిలావుండగా యువతిని ఉరి తీయాలని మృతుని కుటుంబీకులు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు