గ్యాస్ లీకేజీతో మృతిచెందిన దంపతులు
జ్యోతినగర్(రామగుండం): గ్యాస్లీకేజీ ప్రమాదంలో చికిత్స పొందుతూ మొన్న భార్య.. నేడు భర్త మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యరు. రామగుండం 44వ డివిజన్ గేట్ ఏరియాలో కత్తుల చెన్నకేశవులు(32), అతడి భార్య మాధవి(29) వెంకటరమణ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. గత నెల 24న ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిపోవడంతో మరో సిలిండర్ అమర్చుతున్న క్రమంలో గ్యాస్ లీకేజీ అయింది.
దీంతో భార్యా,భర్తలు సిలిండర్ను ఇంటి వెనుకాల ఖాళీ స్థలంలోకి తీసుకెళ్తుండగా అక్కడే ఉన్న బొగ్గు పొయ్యి నుంచి మంటలు చెలరేగి ఇద్దరికి అంటుకున్నాయి. ఆస్పత్రికి తరలించగా ఆదివారం మాధవి మృతిచెందింది. కేశవులు హైదరాబాద్ గాంధీలో చికిత్స పొందతూ మంగళవారం అర్ధరాత్రి చనిపోయాడు.భార్యా,భర్తల మృతితో కాలనీలో విషాదం అలుముకుంది. మృతుల కూతురు హారిక, కుమారుడు హరిభువన్ అనాథలుగా మారారు.