'ఆ బాంబు బెదిరింపు నకిలీయే' 

4 Sep, 2019 18:25 IST|Sakshi

డీసీపీ ప్రకాశ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. సాయిరాం కాలేరు అనే పేరుతో ఒక అగంతకుడు మెయిల్‌ రూపంలో అధికారులకు పంపిన విషయం విదితమే . కాగా, ఈ బాంబు బెదిరింపు ఫేక్‌ మెయిల్‌గా గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి బుధవారం ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు.

డీసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సాయిరాం, శశికాంత్‌ ఇద్దరు మంచి స్నేహితులు. కాగా, సాయిరాం గత కొన్ని రోజులుగా కెనడా వెళ్లే పనిలో వీసా కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో  సాయిరాం వీసా అప్లికేషన్‌ దరఖాస్తు చేయడం కోసం శశికాంత్‌ ఇంటికి వెళ్లాడు. అప్లికేషన్‌కు సంబంధించిన వివరాలను సాయిరాం కంప్యూటర్‌లో అప్‌లోడ్‌ చేస్తుండగా శశికాంత్‌ ఆ వివరాలను రహస్యంగా సేకరించినట్లు తెలిపారు. సాయిరాం పేరుతో అసభ్య పదజాలంతో కూడిన సమాచారాన్ని శశికాంత్‌ కెనడా వీసా సైట్‌లో అప్లోడ్‌ చేయడాన్ని తెలుసుకున్న సాయిరాం రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై ఫిర్యాదు ఇచ్చాడన్న కోపంతో ఎలాగైనా సాయిరాంను కెనెడా వెళ్లకుండా అడ్డుకోవాలని శశికాంత్‌ విశ్వప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే 4వ తేదిన శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి సాయిరాం కెనడాకు వెళ్తున్నట్లు తెలుసుకున్న శశికాంత్‌ సాయిరాం మెయిల్‌ ఐడీతో ఎయిర్‌పోర్ట్‌ను బ్లాస్ట్‌ చేయనున్నట్లు మెయిల్‌ రూపంలో అధికారులకు పంపినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ ఘటనకు సూత్రధారుడైన శశికాంత్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. (చదవండి : శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు)

మరిన్ని వార్తలు