విద్యార్థిని శ్రావణి హత్య.. ఎస్‌ఐపై వేటు

27 Apr, 2019 12:44 IST|Sakshi

సాక్షి, యాదాద్రి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విద్యార్థిని శ్రావణి హత్య కేసు విషయంలో యాదాద్రి-భువనగిరి జిల్లా బొమ్మలరామారం ఎస్‌ఐ వెంకటయ్యపై ప్రభుత్వం వేటు వేసింది. హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌చేస్తూ డీసీపీ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థిని శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యం వహించారని ఎస్‌ఐపై చర్యలు తీసుకున్నారు. ఇక పదోతరగతి స్పెషల్‌ క్లాసులకు వెళ్లిన విద్యార్థిని శ్రావణి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దుండగులు ఆమె మృతదేహాన్ని ఓ పాడుబడ్డ బావిలో ఖననం చేయగా.. ఈ కేసు దర్యాప్తులో ఆలస్యంగా స్పందించిన పోలీసుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసు వాహనాలపై దాడికి దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ఈ సంఘటన వెలుగుచూసింది. గురువారం అదృశ్యమైన శ్రావణి.. మరుసటి రోజు పాడుబడ్డబావిలో శవంగా కనిపించింది. ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది.

కుటుంబ సభ్యుల ఆందోళన
విద్యార్థిని శ్రావణిని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని భువనగిరి రహదారిపై హాజీపూర్‌ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనతో రాకపోకలు భారీగా స్తంభించాయి.
చదవండి: అదృశ్యమైన బాలిక హత్య 

మరిన్ని వార్తలు