దృశ్యం సినిమాను తలపించిన హత్య కేసు

7 Apr, 2018 07:29 IST|Sakshi
శవాన్ని వెలికి తీస్తున్న దృశ్యం(ఇన్‌సెట్‌) మృతుడు నరసింహులు (ఫైల్‌)

శవం కోసం తవ్వితేబయటపడిన గొర్రె కళేబరం

నరసింహులును హత్యచేసినట్టు నిందితులఅంగీకారం

ఎట్టకేలకు శవం వెలికితీత

పెద్దతిప్పసముద్రం: మండలంలోని మద్దయ్యగారిపల్లి పంచాయతీ బురుజుపల్లి సమీపంలో గురువారం రాత్రి ఓ వ్యక్తి శరీర భాగం ప్రజల కంట పడింది. వారు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. అదే గ్రామానికి చెందిన జరిపిటి నరసింహులు (45) అనే వ్యక్తి ఈ నెల 2వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడని అత్త చౌడమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుందేళ్ల వేటకు వెళదామని బురుజుపల్లికి చెందిన ఓ వ్యక్తి సోమవారం రాత్రి తమ ఇంటికి వచ్చి తీసుకెళ్లాడని అప్పటి నుంచి తమ అల్లుడు ఇంటికి రాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ రుషికేశవ్, తహశీల్దార్‌ హనుమంతు, ఎస్‌ఐలు రవికుమార్, ఈశ్వరయ్య గ్రామానికి చేరుకుని శరీర భాగం బయటపడిన ప్రాంతం వద్ద తవ్వకాలు చేపట్టారు. అక్కడ గొర్రె కళేబరం బయట పడింది. అనుమానితులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా శవం ఉన్న స్థలాన్ని చూపించారు.

హత్య ఎలా జరిగిందంటే
మృతుడు జరిపిటి నరసింహులు భార్య పదేళ్ల క్రితం మృతి చెందింది. ఇతనికి మహేష్‌ (14), భవాని (10) పిల్లలు ఉన్నారు. నరసింహులు తమ గొర్రెలను అపహరిస్తున్నాడని, మూడు నెలల క్రితం పీటీఎం సమీపంలో రామస్వామిని కూడా అతనే చంపి ఉంటాడని అదే గ్రామానికి వెంకట్రమణారెడ్డి, రాజేష్‌రెడ్డి, కుమార్‌రెడ్డి అనుమానించారు. ఎలాగైనా నరసింహులును అంతమొం దించాలని పథకం పన్నారు. ఇదే గ్రామానికి చెందిన నాగరాజు సహకారం తీసుకున్నారు. కుందేళ్ల వేటకు వెళదామని నాగరాజు ఈ నెల 2న నరసింహులు ఇంటికి వెళ్లి అతన్ని వెంట తీసుకెళ్లాడు. పథకం ప్రకారం నాగరాజుతో పాటు వెంకట్రమణారెడ్డి, రాజేష్‌రెడ్డి, కుమార్‌రెడ్డి కలిసి నరసింహులును గ్రామ శివారులోని దయ్యాల చెరువు ముళ్ల పొదల్లో గడ్డపార, కొడవలితో నరికి హత్య చేశారు. ఆ ప్రదేశంలో రక్తపు ఆనవాళ్ళు లేకుండా గడ్డితో కాల్చి వేశారు. అనంతరం శవాన్ని దయ్యాల బావిలో పూడ్చి పెట్టారు.

మరిన్ని వార్తలు