-

బాలికపై లైంగికదాడి: ముద్దాయికి మరణశిక్ష..

20 Dec, 2019 10:31 IST|Sakshi
కోర్టు ఆవరణలో నిందితుడు సునీల్‌ నాయక్‌

బాలికపై లైంగికదాడి, హత్య కేసులో విచారణ పూర్తి 

తీర్పు వెలువరించిన కెంజొహార్‌ జిల్లా అదనపు మెజిస్ట్రేట్‌

భువనేశ్వర్‌: మూడేళ్ల చిన్ని పాపపై లైంగికదాడికి పాల్పడి, హత్య చేసిన   నిందితుడికి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. కెంజొహార్‌ జిల్లా అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ కోర్టు ఈ తీర్పు వెలువరించింది.  2017 వ సంవత్సరంలో సునీల్‌ నాయక్‌ అనే నిందితుడు కెంజొహార్‌ జిల్లాలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోక్సో చట్టం కింద 28 సాక్షుల వివరణను పరిశీలించిన అనంతరం నిందితుడికి మరణ శిక్ష ఖరారు చేసినట్లు కెంజొహార్‌ జిల్లా అదనపు మేజిస్ట్రేట్‌ లోక్‌నాథ్‌ సాహు తెలిపారు. 

పై కోర్టుకు వెళ్తా..
ఈ కేసులో నన్ను ఇరికించారు. వాస్తవానికి ఈ కేసులో నాకు ఎటువంటి ప్రమేయం లేదు. దిగువ న్యాయ స్థానం తీర్పును సవాల్‌ చేసేందుకు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు నిందితుడు సునీల్‌ నాయక్‌ తెలిపాడు. 2017 వ సంవత్సరం జనవరి 13వ తేదీన నిందితుడు మూడేళ్ల బాలికను ఒంటరిగా తీసుకుని పోయి నిర్మానుష్య ప్రాంతంలో లైంగికదాడికి పాల్పడి హత్య చేసినట్లు ఆరోపణ. బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా  బలవంతపు చర్య, షాక్‌తో  చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. మృత బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి విచారణ చేపట్టిన చంపువా స్టేషన్‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడికి వ్యతిరేకంగా ఆరు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం విచారణ కొనసాగించిన అనంతరం నిందితుడికి మరణ శిక్ష విధించినట్లు ప్రభుత్వన్యాయవాది గణేష్‌ చంద్ర మహాపాత్రో తెలిపారు.

మరిన్ని వార్తలు