నక్సల్స్‌ నెత్తుటిధార.. 40కి పెరిగిన మృతులు

24 Apr, 2018 14:29 IST|Sakshi
గడ్చిరోలి జిల్లాలో ఆదివారం రాత్రి ఎన్‌కౌంటర్‌ అనంతరం సాయుధబలగాలు, కింద మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధ సామాగ్రి

గడ్చిరోలి: వేసవికాలంలో పలుచబడ్డ అడవిలో నెత్తుటిధారలు ఆగడంలేదు. మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఒకదానితర్వాత మరొకటి ఎన్‌కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. గడ్చిరోలి, సుక్మా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం నుంచి మంగళవారం వరకు చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్లలో సుమారు 40 మంది మందికి మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. నక్సల్స్‌ నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని, ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

ఇంద్రావతి తీరంలో 15 మృతదేహాలు..
అసలేం జరిగింది?: ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో శనివారం నక్సల్స్‌ జరిపిన దాడిలో సీఆర్పీఎఫ్‌ ఏఎస్సై ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ వెంటనే నక్సల్స్‌ కోసం భారీ కూంబింగ్‌ ఆపరేషన్‌ ప్రారంభమైంది. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, సీఆర్పీఎఫ్‌, కోబ్రా బలగాలు సంయుక్తంగా కిలోమీటర్ల మేర అడవిని జల్లెడపట్టాయి. ఈ క్రమంలో..
శనివారం రాత్రి.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి వద్ద చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు.
ఆదివారం రాత్రి.. ఛత్తీస్‌గఢ్‌ సుకుమా జిల్లాలోని పూసుపాల్‌ సమీపంలోని అడవిలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 5గురు నక్సల్స్‌ చనిపోయారు.
సోమవారం సాయంత్రం..గడ్చిరోలి జిల్లా రాజారాం ఖాండ్లా అడవిలోని జిమాల్‌గట్ట ప్రాంతంలో ఎదురుకాల్పులు జరగడంతో 4గురు మావోయిస్టులు మరణించారు.
మంగళవారం ఉదయం.. గడ్చిరోలి జిల్లా ఇంద్రావతి నదీ తీరంలో 15 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు.

మరిన్ని వార్తలు