డిగ్రీ విద్యార్థి వివాహేతర సంబంధం.. రాళ్లతో కొట్టి..

4 Jan, 2019 09:44 IST|Sakshi
నూనావత్‌ హరీష్‌ మృతదేహం

తిరుమలాయపాలెం: వివాహేతర సంబంధానికి యత్నించిన ఓ యువకుడు... ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని బాలాజీనగర్‌ తండా పరిధిలోని రమణాతండాలో గురువారం సాయంత్రం ఇది జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు... ఈ గ్రామానికి చెందిన నూనావత్‌ కస్నా-సుహాలీ దంపతుల కుమారుడు హరీష్‌(19), డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థి. ఇదే తండాకు చెందిన మాలోతు చంటి భార్య సునితతో హరీష్‌ గత కొంతకాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు.

గతంలో పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. హరీష్‌ పద్ధతి మారకపోవడంతో అతడిపై చంటి కోపంతో ఉన్నాడు. చంటి భార్య సునిత, తమ పంట భూమిలో పత్తి తీసేందుకు గురువారం వెళ్లింది. సాయంత్రం వేళ, హరీష్‌ కూడా ఆమె చేను వద్దకు వెళ్లాడు. దీనిని చంటి గమనించాడు. హరీష్‌ను చూడగానే ఒక్కసారిగా రాళ్లతో దాడికి దిగాడు. భయంతో పారిపోతున్న హరీష్‌ను, సమీపంలోగల అడవి వరకు వెంబడించి తలపై బండ రాళ్లతో కొట్టాడు. తీవ్ర గాయాలతో హరీష్‌ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఆ తరువాత, తన భార్యతో కలిసి మోటార్‌ సైకిల్‌పై రమణాతండాలోకి చంటి వచ్చాడు. హరీష్‌ను తానే కొట్టి చంపినట్టు స్థానికులతో చెప్పి పరారయ్యాడు. ఇతడు, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయినట్టు తెలిసింది.

హత్యాస్థలాన్ని ఖమ్మం రూరల్‌ ఏసీపీ రామోజీ రమేష్, కూసుమంచి సీఐ మురళి, ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి పరిశీలించారు. హరీష్‌ మృతదేహాన్ని తండా యువకుల సహాయంతో గ్రామానికి తీసుకొచ్చారు. పోస్టుమార్టం కోసం పోలీస్‌ వాహనంలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తండాలో ఉద్రిక్తత
హరీష్‌ హత్యతో ఆ తండాలో ఉద్రిక్తత నెలకొంది. చంటిని తమకు అప్పగించాలంటూ స్థానికులు కొందరు పోలీస్‌ వాహనాన్ని అడ్డగించారు. వారికి ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి నచ్చచెప్పి, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు