టూర్‌కెళ్లాలి.. డబ్బులు లేవు.. అందుకని

14 Dec, 2018 11:16 IST|Sakshi

న్యూఢిల్లీ : విహరయాత్రకు వెళ్లాలని భావించిన ఓ వ్యక్తి అందుకు కావాల్సిన డబ్బు కోసం ఏకంగా పని చేస్తోన్న కంపెనీకే కన్నం వేయాలని ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. వివరాలు.. సోను(20) ఢిల్లీలోని ఓ డోమినోస్‌ ఔట్‌లెట్‌లో స్వీపర్‌గా పని చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి మనాలి వెళ్లి ఎంజాయ్‌ చేయాలనుకున్నాడు. అయితే అందుకు కావాల్సిన సొమ్ము సంపాదించడం కోసం పని చేస్తోన్న షాప్‌కే కన్నం వేయాలని ప్లాన్‌ చేశాడు. ముందుగా ఈ పనిలో తనకు సహకరించడం కోసం ఇద్దరు కాంట్రాక్ట్‌ కిల్లర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత స్టోర్‌ తాళం చెవులు దొంగతనం చేసి వారికి ఇచ్చాడు.

తాళం చెవి తీసుకున్న వ్యక్తులు సోను స్నేహితుడు బంటితో కలిసి డోనాల్డ్స్‌ ఔట్‌లెట్‌కి వెళ్లారు. అక్కడ పని చేస్తోన్న ఉద్యోగుల తలకు తుపాకీ గురి పెట్టి క్యాష్‌ కౌంటర్‌లో ఉన్న 1.70 లక్షల రూపాయల సొమ్మును తీసుకుని వెళ్లిపోయారు. అనంతరం సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేస్‌ నమోదు చేసిన పోలీసులు.. ఔట్‌లెట్‌లో పని చేస్తోన్న ఉద్యోగులను విచారించగా సోను మీద అనుమానం వచ్చాంది. అతన్ని పూర్తి స్తాయిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విహారయాత్రకు వెళ్లాలని భావించిన సోను.. అందుకు కావాల్సిన సోమ్ము కోసం స్నేహితులతో కలిసి దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం సోను, అతనికి సహకిరంచి వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు