రద్దీ ట్రాఫిక్‌లో కాల్పులు.. ఇద్దరు నేరస్తులు మృతి

20 May, 2019 08:21 IST|Sakshi

న్యూఢిల్లీ : పట్టపగలు.. జనంతో కిక్కిరిసిన రోడ్డు మీద రెండు గ్యాంగ్‌లు పరస్పరం కాల్పులతో బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో ఇద్దరు పాత నేరస్తులు మృతి చేందారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ ద్వారకా మోర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నవడా ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌ గెహ్లోత్‌, వికాస్‌ దళాల్‌ రెండు వేర్వేరు గ్యాంగ్‌లు నడుపుతూ నేరాలకు పాల్పడుతుంటారు. వీరి మీద ఢిల్లీ, హరియాణాలో గతంలోనే హత్యా, కిడ్నాప్‌, దొంగతనం వంటి పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ రెండు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ జరిగింది. ప్రవీణ్‌ గెహ్లోత్‌ ప్రయాణిస్తున్న కారును మరో గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు తమ కారుతో అడ్డగించడమే కాక కాల్పులకు తెగబడ్డారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఢిల్లీలో రెండు గ్యాంగ్‌లు పరస్పరం కాల్పులు

దాంతో ప్రవీణ్‌ గెహ్లోత్‌ కూడా కాల్పులు ప్రారంభించాడు. నడి రోడ్డు మీద.. జనం చూస్తుండగానే దాదాపు 15 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగలు. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో మెట్రో స్టేషన్‌కు సమీపంలోనే పోలీసులు ఉండటంతో.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రావడం గమనించిన నిందుతులు అక్కడి నుంచి పారరయ్యారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు నేరస్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. రెండు గ్యాంగ్‌ల మీద కేసు నమోదు చేశామని.. త్వరలోనే నిందితులను  అరెస్ట్‌ చేస్తామని పోలీసులు తెలిపారు. దలాల్‌ 2018 హరియాణా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని వచ్చాడని.. అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు