దేశ రాజధానిలో దారుణం

4 Oct, 2018 11:30 IST|Sakshi

కూతురిపై తండ్రి అత్యాచారం

సాక్షి, న్యూఢిల్లీ: కుమార్తెను రేప్‌ చేశాడని, ఆమెను దెబ్బలు కొట్టాడనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు మంగోల్‌పురిలో నివసించే ఓ వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు తన కూతురుపై 2008 నుంచి లైంగిక అత్యాచారం చేస్తున్నాడని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. తండ్రి తనకు మొబైల్‌లో బ్లూఫిల్మ్‌లు చూపించి అత్యాచారం జరిపేవాడని, ఆయన వల్ల తాను 2011లో, 2013లో గర్భవతి అయ్యానని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఒకసారి మందు తాగించి గర్భస్రావం చేశాడని, మరోసారి కడుపుపై తన్ని గర్భస్రావమయ్యేలా తన తండ్రి చేశాడని ఆమె తెలిపింది.

మొదట అర్థం కాలేదు...
మొదట తనకు తండ్రి చేసే అకృత్యం అర్థం కాలేదని, కానీ జ్ఞానం వచ్చాక ఆయనను వ్యతిరేకించడం మొదలుపెట్టానని బాధితురాలు తెలిపింది. కానీ తండ్రి తన వ్యతిరేకతను ఖాతరు చేయలేదని, తల్లి అడ్డం చెప్పడంతో ఇంట్లో గొడవలు జరిగాయని ఆమె తెలిపింది. తన మాట వినకుంటే కూతురు జననాంగాలలో కత్తి లేదా పగిలిన మద్యం సీసా పెడతానని తండ్రి బెదిరించేవాడని, తండ్రి బెదిరింపులతో తల్లి కూడా నోరు మూసుకునేదని ఆమె తెలిపింది. ఇంట్లో గొడవలు కాకూడదనే అభిప్రాయంతో తండ్రి చేసే అకృత్యాల గురించి తల్లికి చెప్పడం మానేశానని బాధితురాలు తెలిపింది. తాను గట్టిగా వ్యతిరేకించినప్పుడు తండ్రి కొన్ని రోజుల పాటు దూరంగా ఉండేవాడని, ఆ తరువాత మళ్లీ అత్యాచారాలకు పాల్పడేవాడని బాధితురాలు పేర్కొంది. తన స్నేహితులతో గడపమని తండ్రి తనపై ఒత్తిడి తెచ్చేవాడని ఆమె తెలిపింది. తండ్రి అకృత్యాలను భరించలేక ఒకసారి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని, కానీ తల్లి తన ప్రాణాలు కాపాడిందని ఆమె తెలిపింది.

ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ సాయంతో...
చివరకు బాధితురాలు తన ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ సహాయాన్ని కోరింది. 2015లో ఆమె ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌కు తన గోడు వెళ్లడించిందని పోలీసులు పేర్కొన్నారు. తన తండ్రి నుంచి తనకు విముక్తి లభించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఆమె తన ఫ్రెండ్‌కు జూలై 25న తెలిపింది. ఫేస్‌బుక్‌ ప్రెండ్‌ సహాయంతో బాధితురాలు ఇంట్లోంచి పారిపోయి నాగ్‌పూర్‌ చేరుకుంది. కొన్ని రోజులు అక్కడ ఉన్న తరువాత చైల్డ్‌ లైన్‌పై ఫిర్యాదు చేసింది. నాగ్‌పూర్‌ పోలీసులు కేసును ఢిల్లీకి బదిలీ చేశారు. సెప్టెంబర్‌ 30న పాలం పోలీసు స్టేషన్‌లో నిందితునిపై కేసు నమోదైంది. పోలీసులు ఇంకా నిందితుడిని అరెస్టు చేయలేదు. బాధితురాలికి 17 సంవత్సరాల వయసు ఉంటుందని, ఆమె 12వ తరగతి చదువుతోందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు