నమ్మి వచ్చినందుకు.. దారుణంగా హతమార్చాడు

27 Jun, 2018 12:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు అడ్డుగా ఉందన్న కారణంతో భార్యను అతి దారుణంగా చంపిన ఘటన సరితా విహార్‌ ఏరియాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఢిల్లీకి చెందిన ఇంజనీర్‌ సాజిద్‌ అలీ అన్సారీకి రాంగ్‌ కాల్‌ ద్వారా 2010లో బీహార్‌కు చెందిన యువతితో స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో అలీని పెళ్లి చేసుకోవాలన్న ఆ యువతి తన కుటుంబాన్ని వదిలేసి అలీ దగ్గరికి వచ్చేసింది. 2014లో అలీ కుటుంబ సభ్యుల అంగీకారంతో వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన తర్వాత అలీ ఉద్యోగం మానేయడంతో తరచుగా వారి మధ్య గొడవలు జరిగేవి.

సంపన్న కుటుంబం నుంచి వచ్చిన అలీ భార్య పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబ పరిస్థితి మరింతగా దిగజారడంతో కుంగిపోయింది. దీంతో భర్తతో తరచుగా గొడవ పడేది. ఈ క్రమంలో అతడికి వేరొక మహిళతో స్నేహం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న అలీ భార్య అతడిని నిలదీసింది. దీంతో విసుగు చెందిన అలీ ఎలాగైనా భార్యను వదిలించుకోవాలని పథకం రచించాడు. ఈ నెల 21న ఆమెను హత్య చేసి.. శవాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు బండ రాయితో ముఖంపై మోదాడు. తర్వాత సోదరుల సాయంతో శవాన్ని ఏడు ముక్కలుగా నరికి సంచిలో కుక్కి ఓక్లా ట్యాంక్‌ అటవీ సమీపంలో పడేశాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అలీ కదలికలపై నిఘా వేసి అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది. ఈ హత్యలో అలీకి సహకరించిన అతడి సోదరులిద్దరినీ కూడా అరెస్టు పోలీసులు చేశారు.

మరిన్ని వార్తలు